గల్ఫ్ లో యుద్ధం మళ్లీ మొదలైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందానికి ఒక్క రోజులోనే కాలం తీరిపోయింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగించిన నేపథ్యంలో, ప్రతిస్పందనగా ఇరాన్ కీలక సముద్ర మార్గమైన హోర్మోజ్ జల సంధిని మళ్లీ మూసివేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ చర్యపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే ఆ మార్గాన్ని తిరిగి తెరవాలని డిమాండ్ చేసింది. అమెరికా, ఇరాన్ రెండూ ఈ ఒప్పందాన్ని తమ విజయంగా పేర్కొన్నాయి. ప్రపంచ దేశాలు ఈ కాల్పుల విరమణపై ఉపశమనం వ్యక్తం చేసినప్పటికీ, అదే సమయంలో ఇరాన్ మరియు గల్ఫ్ అరబ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణి దాడులు కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు, ఇజ్రాయెల్ లెబనాన్లోని హిజ్బుల్లా పై దాడులను మరింత తీవ్రతరం చేసింది. బీరూట్లోని వాణిజ్య, నివాస ప్రాంతాలపై జరిగిన ఈ దాడుల్లో బుధవారం ఒక్క రోజులోనే కనీసం 182 మంది మృతి చెందడం గమనార్హం.
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ ఒప్పందాన్ని “సున్నితమైనది”గా పేర్కొంటూ, ఎప్పుడైనా విఫలమయ్యే అవకాశముందని హెచ్చరించారు. మరోవైపు, ఇరాన్కు చెందిన సెమీ అధికారిక వార్తా సంస్థలు విడుదల చేసిన నివేదికలు కొత్త ఆందోళనలకు దారి తీసాయి. వాటి ప్రకారం, యుద్ధ సమయంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ హోర్ముజ్ సముద్ర మార్గంలో మైన్స్ (సముద్ర బాంబులు) ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది.
ISNA, Tasnim వంటి వార్తా సంస్థలు ప్రచురించిన గ్రాఫిక్లో నౌకలు ప్రయాణించే మార్గంలో “డేంజర్ జోన్”గా గుర్తించి, అక్కడ మైన్స్ ఏర్పాటు చేసినట్లు సూచించాయి. దీంతో నౌకలు లారక్ దీవి సమీపంలోని ఇరాన్ తీర ప్రాంతానికి దగ్గరగా వెళ్లే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 9 వరకు ఈ చర్యలు కొనసాగినట్లు ఆ గ్రాఫిక్లో పేర్కొన్నారు. అయితే, ఆ మైన్స్ను పూర్తిగా తొలగించారా లేదా అన్నది స్పష్టత లేదు.
ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, ఈ పరిణామాలు భవిష్యత్ చర్చలపై ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా ఇస్లామాబాద్లో జరగనున్న శాంతి చర్చల ముందు ఈ ఉద్రిక్తతలు మరింత అనిశ్చితిని పెంచుతున్నాయి.
