సంగారెడ్డి జిల్లా సింగూరు ముంపు ప్రాంతంలో మంత్రి బామ్మర్ది అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది . ముంపు ప్రాంతంలో ని ఎఫ్ టి ఎల్ లో చదును చేస్తున్నారంటూ గత మూడు రోజులుగా స్థానిక ప్రజలు, ప్రతిపక్ష నాయకులు మీడియా కథనాలు రాసినప్పటికీ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ అవి ఏవి తనకు వర్తించమంటూ తన పనులు తను కొనసాగిస్తున్నారు.
ముంపు ప్రాంతంలో మట్టిని తవ్వి కుప్పలుగా పోసి రాళ్ళను కూడా రోడ్డు కోసం తరలించడం జరిగింది. ఒకవైపు దానిపై జాయింట్ సర్వే చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినప్పటికీ అధికారులు ఇప్పటివరకు నిర్మాణాలను ఆపలేకపోయారు. మూడు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆ ప్రాంతంలో పర్యటించగా రెండు రోజులపాటు మట్టి తవ్వి చదునుచేసే కార్యక్రమాలు ఆగిపోయాయి.
కానీ మొన్న రాత్రి నుంచి మళ్లీ అధికారులు అండతో మళ్లీ తవ్వకాలు మొదలుపెట్టారు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంత్రి బామ్మర్ది చేస్తున్న ఈ అక్రమ నిర్మాణాలతో తమ గ్రామం మునిగిపోయే ప్రమాదం ఉందని సమీపంలోని సాయి పేట గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
అధికారులు మాత్రం ఈ వ్యవహారం తమది కాదన్నట్టు, ఇది ప్రభుత్వ భూమి అయినా సరే దాన్ని మేము కాపాడాల్సిన అవసరం లేదన్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారని స్థానికుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చదును చేస్తుండగా స్థానికులు రావడం గమనించి పనులు ఆపేశారు. తాజా వీడియోలను స్థానికులు మీడియా కు విడుదల చేశారు.
