బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమెపై గతంలో నమోదైన మూడు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులను కొట్టివేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో గద్వాలలోని తేరు మైదానంలో బతుకమ్మ పండుగ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనే ఆరోపణలతో ఐపీసీ సెక్షన్ 188 కింద గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై విచారణ జరిపిన గౌరవ న్యాయమూర్తి జస్టిస్ కె. సుజనా ఫిబ్రవరి 19, 2026న తుది ఆదేశాలు జారీ చేశారు.
ఈ కేసుల విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేయాలంటే, సీఆర్పీసీ సెక్షన్ 195 నిబంధనల మేరకు సంబంధిత ప్రభుత్వ అధికారి నేరుగా మేజిస్ట్రేట్ కోర్టులో రాతపూర్వక ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
అయితే ఈ మూడు కేసుల్లోనూ ఆ చట్టపరమైన విధివిధానాలను పాటించలేదని, నేరుగా పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఛార్జ్షీట్లు దాఖలు చేయడం చట్టబద్ధంగా చెల్లదని కోర్టు పేర్కొంది. న్యాయపరమైన లోపాల కారణంగా గద్వాల మేజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్లో ఉన్న ఎస్టీసీ నెం. 10407/2024, సీసీ నెం. 457/2021 మరియు సీసీ నెం. 427/2022 కేసులను పూర్తిగా కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ తీర్పుతో ఎంపీ డీకే అరుణపై ఉన్న ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణల నుంచి ఆమెకు పూర్తిస్థాయిలో చట్టపరమైన విముక్తి లభించింది
.
