డిఎస్సీ 2025 లో స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. “గొడ్డలి పార్టీకి విమర్శలు చేయడం, విధ్వంసకర రాజకీయాలు చేయడం తప్ప మరేమీ చేతకాదు” అని వ్యాఖ్యానించారు.
ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయలేని వారిని ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. అసత్యాలను పదేపదే ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని కొందరు భావిస్తున్నారని, కానీ ప్రజలు వాస్తవాలను గుర్తించగలరని అన్నారు. క్రీడా రంగంపై సరైన అవగాహన లేకుండానే విమర్శలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కేటగిరీలు, నిబంధనల ప్రకారమే ఈ ఉద్యోగాలు భర్తీ చేశామని స్పష్టం చేశారు.
డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ విషయంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకంతోనే నియామక ప్రక్రియను ప్రారంభించి, అత్యంత పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేపట్టామని చెప్పారు.
కొంతమంది సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపించిన ముఖ్యమంత్రి, పారదర్శకంగా జరిగిన నియామకాలపై కూడా ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు ముందుగా అధ్యయనం చేసి, వాస్తవాలను పరిశీలించిన తర్వాతే మాట్లాడాలని సూచించారు.
తమ రాజకీయ జీవితంలో ఎన్నో సందర్భాల్లో సాక్ష్యాలు, వాస్తవాలతో అసెంబ్లీలో పోరాడిన అనుభవం ఉందని చంద్రబాబు చెప్పారు. ఆధారాలు లేకుండా బురదజల్లే ప్రయత్నాలను ప్రజలు విశ్వసించరని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆరోగ్యం, యోగా ప్రోత్సాహానికి చేపడుతున్న కార్యక్రమాలపై కూడా విమర్శలు చేయడం విచారకరమని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్మాణాత్మక నిర్ణయాన్ని వ్యతిరేకించడం కొందరి రాజకీయ ధోరణిగా మారిందని విమర్శించారు.
ప్రజలకు మంచి చేయడంలో రాజకీయ పార్టీలు పోటీ పడాలని, కానీ సమాజంలో విభేదాలు, వివాదాలు సృష్టించడం సరైన విధానం కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు పూర్తయ్యాయని, ఈ కాలంలో ఎవరు ప్రజలకు మంచి చేశారో ప్రజలందరికీ తెలుసని అన్నారు.
అభివృద్ధిని తార్కికంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, అనవసర రాజకీయ వివాదాలు సృష్టించడం రాష్ట్ర ప్రయోజనాలకు మంచిది కాదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
