పల్నాడు జిల్లా లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురజాల మండలం పరిధిలో పులిపాడు–దైద మార్గమధ్యంలో జరిగిన దాడి సంచలనం రేపుతోంది. బీసీ నాయకుడు బత్తుల ఏడుకొండలు బైక్ వెళ్తుండగా, మార్గమధ్యంలో బైక్ ఆపి వైసీపీకి చెందిన వ్యక్తులు గుంపుగా దాడి చేసినట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి.
దాడి దారుణంగా మారి, ఆయన కాళ్లు విరగ్గొట్టినట్లు సమాచారం. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. తీవ్ర గాయాలతో ఉన్న బత్తుల ఏడుకొండలను ముందుగా గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు కు తరలించినట్లు తెలుస్తోంది.
ఈ దాడిపై టిడిపి నాయకులు తీవ్రంగా స్పందిస్తూ, ఇది రాజకీయ కక్షసాధింపేనని ఆరోపిస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
