ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో, పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో 48 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలపై నోటీసులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు.
ప్రజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పనిసరిగా పాల్గొనాలని, ఈ బాధ్యతను నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని సీఎం హెచ్చరించారు. తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బ్యాక్ ఆఫీస్ విభాగాలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు నిర్వర్తిస్తున్న కార్యక్రమాలపై విస్తృతంగా సమీక్ష చేపట్టారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధులు చురుకైన పాత్ర పోషించాలని సీఎం స్పష్టం చేశారు.
ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వారానికి కనీసం ఒక రోజు ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల అర్జీలు స్వీకరించాలని ఆయన ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిష్కారం అయ్యే వరకు నిరంతరంగా ఫాలోఅప్ చేయాలని సూచించారు.
నియోజకవర్గ స్థాయిలో పరిష్కరించలేని సమస్యలను జిల్లా స్థాయిలో, అక్కడా పరిష్కారం కాని అంశాలను రాష్ట్ర స్థాయిలో పరిష్కరించే విధంగా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. అలాగే ప్రతి ప్రజా ప్రతినిధి ప్రతి నెల 1వ తేదీన పేదల సేవ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీలో పాల్గొనడం తప్పనిసరి అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై, ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చూసే బాధ్యత ఎమ్మెల్యేలదే అని గుర్తుచేశారు. చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ, “ప్రజల సేవే మన ధ్యేయం. అందుకు ప్రజా ప్రతినిధులంతా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. బాధ్యత తప్పించుకునే వారిని క్షమించం” అని స్పష్టం చేశారు.
ఆయన ఆదేశాల నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో చురుకుదనం పెరిగింది. ఎమ్మెల్యేలు, మంత్రులు రాబోయే ప్రజావేదిక, పెన్షన్ పంపిణీ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ఈ చర్యలతో ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత దగ్గరవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో ప్రజలతో నేరుగా మమేకమవ్వడం ద్వారా ప్రజా ప్రతినిధుల పనితీరుపై పర్యవేక్షణ మరింత బలపడనుంది.
