వరద ఉద్ధృతి కారణంగా కోనసీమ ప్రాంతంలోని లంక గ్రామాల్లోకి గోదావరి నీరు వేగంగా ప్రవహిస్తున్నది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.
ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని పలు లంక గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. శేరిలంక, కమిని, పశువులలంక, గురజాపులంక గ్రామాల్లోకి వరద నీరు చేరగా, కూనలంక, తానేలంక, పొట్టిలంక గ్రామాల్లో కూడా వరద నీరు ప్రవేశించింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రమాదకర ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. వరద ప్రభావిత గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన వైద్య సేవలను అందుబాటులో ఉంచారు. అలాగే సహాయక చర్యల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తిన ప్రాంతాల్లో తాత్కాలికంగా మరబొట్లు ఏర్పాటు చేసి రవాణా సౌకర్యం కల్పించారు. వరద పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉన్నందున ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, అవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
