ఆహ్లాదకరంగా ఉన్న బీచ్ ఒక్క సారిగా భీకర శబ్దాలతో ఉలిక్కిపడింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ ఆదివారం భయానక ఉగ్రదాడికి వేదికైంది. హనుక్కా పండుగ తొలి రోజును జరుపుకునేందుకు పెద్ద సంఖ్యలో చేరిన ప్రజలపై ఇద్దరు సాయుధ దుండగులు కాల్పులు జరపడంతో కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
పోలీసు సిబ్బందితో సహా మరో 29 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. వెయ్యికి పైగా మంది హాజరైన “చానుక్కా బై ద సీ” కార్యక్రమం జరుగుతున్న ప్రాంతం సమీపంలో ఈ దాడి జరిగింది. ఇది సిడ్నీలోని యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద చర్యగా అధికారికంగా ప్రకటించారు.
న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపిన ప్రకారం, నల్లటి దుస్తులు ధరించిన దుండగులు సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో బాండీ పార్క్లోని ప్లేగ్రౌండ్ మరియు బీచ్ ప్రాంతాన్ని పైనుండి చూసే ఫుట్బ్రిడ్జ్పై నుంచి కాల్పులు జరిపారు. దీంతో అక్కడున్న కుటుంబాలు, పిల్లలు, బీచ్ సందర్శకులు భయంతో అరుస్తూ పరుగులు తీశారు.
కాల్పుల సమయంలో పోలీసులు వెంటనే స్పందించగా, ఒక దుండగుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో దుండగుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. అనుమానితుల వద్దకు సంబంధించిన పేలుడు పరికరం ఒకటి గుర్తించి సురక్షితంగా తొలగించినట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
కాల్పులు కొన్ని నిమిషాల పాటు కొనసాగాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అక్కడ పూర్తిగా అల్లకల్లోల వాతావరణం నెలకొందని, ఎమర్జెన్సీ సిబ్బంది గాయపడిన వారికి అక్కడికక్కడే చికిత్స అందించి సిడ్నీలోని పలు ఆసుపత్రులకు తరలించారని తెలిపారు.
సోషల్ మీడియాలో వెలువడిన వీడియోల్లో ప్రజలు టేబుళ్ల వెనుక దాక్కోవడం, కేఫ్ల్లోకి పరుగులు తీయడం, పిల్లలను కాపాడేందుకు ప్రయత్నించడం కనిపించింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది యూదు వ్యతిరేక ద్వేషంతో చేసిన దుర్మార్గపు ఉగ్రచర్య అని, దేశ గుండెపై దాడి చేసినట్టేనని అన్నారు.
తమ మతాన్ని జరుపుకుంటున్న యూదు ఆస్ట్రేలియన్లనే లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంటూ, దేశంలో ద్వేషం, హింస, ఉగ్రవాదానికి స్థానం లేదని స్పష్టం చేశారు. ఈ దాడిలో భాగస్వాములైన వారందరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, దేశం ఐక్యతతో స్పందిస్తుందని చెప్పారు.
ఈ ఘటనలో ఒక సాధారణ పౌరుడు చూపిన ధైర్యం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. అతను ఒక దుండగుడిపై ధైర్యంగా దాడి చేసి ఆయుధాన్ని లాక్కోవడంతో అనేక ప్రాణాలు రక్షించబడ్డాయని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియన్లు ఇతర ఆస్ట్రేలియన్లను కాపాడేందుకు ప్రమాదం వైపు పరుగెత్తిన తీరు నిజమైన వీరత్వమని ప్రధాని కొనియాడారు.
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆస్ట్రేలియా ప్రభుత్వ విధానాలు దేశంలో యూదు వ్యతిరేకతకు దోహదపడుతున్నాయని ఆరోపించారు. గత ఆగస్టులోనే ఈ అంశంపై ప్రధాని అల్బనీస్కు లేఖ రాసినట్టు తెలిపారు.
యూదు వ్యతిరేకత నాయకులు మౌనం వహిస్తే వ్యాపించే క్యాన్సర్లాంటిదని, చర్యలు తీసుకుంటేనే నయం అవుతుందని వ్యాఖ్యానించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘోర ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, ఉగ్రవాదంపై భారత్కు శూన్య సహనం విధానం ఉందని పునరుద్ఘాటించారు.
ఈ విషాద సమయంలో ఆస్ట్రేలియాకు భారత్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఈ దాడిని కఠినంగా ఖండిస్తూ, బాధితులు మరియు వారి కుటుంబాల పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
