మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయమే తుది ప్రమాణమని, పైరవీలు, వారసత్వ రాజకీయాలకు ఎలాంటి అవకాశం లేదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
ఆదివారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం, ఎల్లందు మున్సిపాలిటీల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.టికెట్ల కేటాయింపుపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే రెండు మూడు బృందాలతో క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్నామని, ప్రజలు మెచ్చిన, గెలిచే సత్తా ఉన్న వారికే అవకాశం దక్కుతుందన్నారు. తన రక్తసంబంధీకులకు కూడా టికెట్లు ఇచ్చే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఓటర్ల మనసు గెలిచిన వారే అభ్యర్థులుగా బరిలోకి దిగుతారని తెలిపారు.
టికెట్ రాని వారు నిరాశ చెందవద్దని, అసంతృప్తితో ఇతర పార్టీల వైపు చూడవద్దని మంత్రి సూచించారు. పార్టీ అధికారంలో ఉన్నందున ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. స్వతంత్రంగా పోటీ చేయాలని ఎవరైనా రెచ్చగొడితే మోసపోవద్దని, అలా చేస్తే రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించారు.
ఏదులాపురం, ఎల్లందు మున్సిపాలిటీలను మోడల్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఫిబ్రవరి 15న శివరాత్రి లోపే ఎన్నికల ప్రక్రియ, కౌంటింగ్, ప్రమాణ స్వీకారం పూర్తయ్యే అవకాశముందని చెప్పారు. కార్యకర్తలే తన బలమని, వారి కష్టం తనకు గౌరవమని పేర్కొన్నారు. అనంతరం రెండు మున్సిపాలిటీల వార్డు నాయకులతో ఆయన ముఖాముఖి చర్చలు నిర్వహించారు.
