అబూదాబీలో శనివారం భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధానిలో పలుచోట్ల గట్టిగా శబ్దాలు వినిపించగా, ఆకాశంలో రక్షణ వ్యవస్థలు స్పందించిన దృశ్యాలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన మధ్యప్రాచ్యంలో వేగంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చోటుచేసుకుంది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సాయుధ దళాల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు జరిపినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. గల్ఫ్ ప్రాంతంలోని పలు దేశాల్లో గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. అబూ ధాబిలోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్ సహా అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా మారినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని క్షిపణులను వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నప్పటికీ, పడిపోయిన అవశేషాల కారణంగా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. అధికారిక ధృవీకరణ కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో యుఏఈ సహా గల్ఫ్ దేశాలు తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేశాయి. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని స్థానిక అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత ముదురే అవకాశమున్న నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
