మిడిల్ ఈస్ట్ వార్ ఆంధ్రప్రదేశ్కు వరంగా మారనుందా అంటే..ప్రస్తుత పరిస్థితులను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. యుద్ధ వాతావరణం కారణంగా గల్ఫ్ దేశాల్లోని డేటా సెంటర్ల భద్రతపై ఆయా సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్ -AWS, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలకు గల్ఫ్ ప్రధాన హబ్గా ఉంది. ముఖ్యంగా దుబాయ్, అబుదాబిలలో ఉన్న ఖజ్నా , గల్ఫ్ డేటా హబ్ వంటి భారీ డేటా సెంటర్లు ఇప్పుడు ముప్పులో ఉన్నాయి. దీంతో ఆయా సంస్థలు తమ కార్యకలాపాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే యోచనలో ఉండగా.. అందరి చూపు భారత్, ప్రధానంగా ఏపీ వైపు మళ్లుతోంది.
రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం, సుదీర్ఘ తీరప్రాంతం, డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ను తదుపరి డెస్టినేషన్గా మార్చుకునేందుకు పలు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. యుద్ధం కారణంగా గల్ఫ్ ఇక ఏమాత్రం సేఫ్ కాదన్న భావన పెరగడం, ఇరాన్ దాడుల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతింటుండటంతో..ప్రత్యామ్నాయం కోసం గ్లోబల్ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ వంటి భారీ పెట్టుబడులు రావడం అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను పెంచింది. గూగుల్ లాంటి దిగ్గజ సంస్థ ఏపీని ఎంచుకోవడంతో ఇతర టెక్ కంపెనీలకు కూడా రాష్ట్రంపై నమ్మకం పెరిగింది. విశాఖపట్నం వంటి నగరాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన అండర్ సీ కేబుల్ కనెక్టివిటీ అందుబాటులోకి రానుండటంతో పాటు..తక్కువ ఖర్చు వంటి అంశాలు ఏపీకి ప్రధానంగా కలిసివస్తున్నాయి.
గతంలో అదానీ గ్రూప్ సహా అనేక సంస్థలు ఏపీలో భారీ డేటా సెంటర్ పార్కులను ప్రకటించాయి. ఇప్పుడు గల్ఫ్ సంక్షోభం తోడవ్వడంతో, మరిన్ని గ్లోబల్ క్లౌడ్ కంపెనీలు తమ సర్వర్లను ఏపీకి తరలించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇది కేవలం భారీ పెట్టుబడులనే కాకుండా, రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కూడా తీసుకురానుంది.
మొత్తానికి గల్ఫ్లో నెలకొన్న అనిశ్చితి ఆంధ్రప్రదేశ్కు ఒక గొప్ప అవకాశంగా మారేలా కనిపిస్తోంది. ప్రభుత్వం గనుక ఇదే వేగంతో మౌలిక సదుపాయాలు కల్పించి, అవసరమైన రాయితీలు అందిస్తే.. రాబోయే రోజుల్లో ఏపీ గ్లోబల్ డేటా హబ్గా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది.
