కడప నగరంలోని ఎర్రముక్కపల్లి ప్రాంతంలో అర్ధరాత్రి జరిగిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వంద మందికిపైగా రౌడీలతో వచ్చిన దుండగులు రెండు జెసిబిల సహాయంతో ఓ నివాస గృహాన్ని పూర్తిగా కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే ఈ కూల్చివేత జరగడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
భాస్కర్, లక్ష్మీ చలపతి, భారవి కుటుంబానికి చెందిన ఇంటిపై దాడి జరిపినట్లు బాధితులు తెలిపారు. ఇంట్లో ఉన్న మహిళలు, పిల్లలు, వృద్ధులను బలవంతంగా బయటకు లాగి, తీవ్ర భయాందోళనకు గురిచేశారని ఆరోపించారు. ముసలివారు, చిన్నారులను కూడా కనికరం లేకుండా బయటకు తరలించారని వాపోయారు.
ఈ ఘటన వెనుక దొంగ రిజిస్ట్రేషన్లతో భూమిని కబ్జా చేయాలనే ప్రయత్నం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంటిని కూల్చివేయడానికి శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకనాథరెడ్డి కారణమని వారు పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎర్రముక్కపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
న్యాయం చేయాలని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అక్రమ కూల్చివేతపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
