దేశవ్యాప్తంగా వరుసగా ఎన్నికవుతున్న పార్లమెంట్ సభ్యుల ఆస్తులు గత పదేళ్లలో కళ్లు చెదిరే రీతిలో పెరిగాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన తాజా విశ్లేషణలో వెల్లడించింది. 2014 నుండి 2024 మధ్య కాలంలో ఎంపీల సగటు ఆస్తులు సుమారు 110 శాతం వృద్ధి చెందగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నేతల సంపద ఏకంగా ఐదు రెట్లు పెరగడం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆస్తుల పెరుగుదల ఆశ్చర్యకరం. 2014లో 22.59 కోట్ల రూపాయలుగా ఉన్న ఆయన ఆస్తులు, 2024 నాటికి ఏకంగా 146.85 కోట్లకు చేరాయి. అంటే పదేళ్ల కాలంలో ఆయన సంపద 124.25 కోట్ల రూపాయల మేర పెరిగింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా ఆస్తులు పెంచుకున్న ఎంపీల జాబితాలో ఆయన మూడవ స్థానంలో నిలిచారు.
వైఎస్సార్సీపీ ఎంపీల సగటు ఆస్తుల పెరుగుదల 532 శాతంగా నమోదు కావడం గమనార్హం.మరోవైపు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. 2014లో కేవలం 4 కోట్లుగా ఉన్న ఆయన సంపద, 2019 నాటికి 17 కోట్లకు, 2024 నాటికి 23 కోట్లకు చేరుకుంది. పదేళ్ల వ్యవధిలో ఆయన ఆస్తుల్లో 488 శాతం పెరుగుదల కనిపించింది.
వివిధ రాజకీయ పార్టీల ఎంపీల సగటు ఆస్తుల వృద్ధిని పరిశీలిస్తే, తెలుగుదేశం పార్టీ ఎంపీల ఆస్తులు 177 శాతం (14 కోట్ల పెరుగుదల), కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఆస్తులు 135 శాతం (6 కోట్ల పెరుగుదల), బిజెపి ఎంపీల ఆస్తులు 108 శాతం (16 కోట్ల పెరుగుదల) పెరిగాయి.
వరుసగా మూడవసారి ఎన్నికైన 102 మంది ఎంపీల అఫిడవిట్లను విశ్లేషించిన ADR, ప్రజా ప్రతినిధుల సంపద సగటున 15.76 కోట్ల నుండి 33.13 కోట్లకు చేరిందని స్పష్టం చేసింది. రాజకీయాల్లో కొనసాగుతూనే ఇంతటి భారీ సంపదను ఎలా సమకూర్చుకుంటున్నారనే అంశంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
