దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో గురువారం భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. పైలట్లకు సంబంధించిన కొత్త విధులు, విశ్రాంతి సమయానికి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తగిన సిబ్బంది లభించకపోవడం వల్ల ఇండిగో విమానాలు రద్దు చేసింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లో ఒక్కరోజులోనే 180కి పైగా ఇండిగో విమానాలను సంస్థ రద్దు చేసింది.
ముంబై విమానాశ్రయంలో 86 విమానాలు, 41 అరైవల్స్, 45 డిపార్చర్లురద్దు కాగా, బెంగళూరులో మొత్తం 73 విమానాలు నిలిపివేశారు. ఇందులో 41 అరైవల్స్ ఉన్నాయని వర్గాలు వెల్లడించాయి. అలాగే ఢిల్లీలో 33 విమానాలను గురువారం రద్దు చేసినట్టు తెలిపాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇక డిసెంబర్ 3న ఇండిగో విమానాల ఆన్-టైమ్ పెర్ఫార్మెన్స్ (OTP) ఆరు ప్రధాన విమానాశ్రయాల్లో 19.7 శాతానికి పడిపోయింది.
ఇది డిసెంబర్ 2న నమోదైన 35 శాతం పనితీరుతో పోలిస్తే గణనీయంగా తక్కువ. రెండో దశ FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్) నిబంధనలు పూర్తిగా అమల్లోకి వచ్చిన తరువాత నుంచి పైలట్ల లభ్యత తీవ్రంగా తగ్గిపోయిందని సంస్థ వర్గాలు ఆనాడు పేర్కొన్నాయి. విమానాల రద్దు, ఆలస్యాలపై విచారణ చేపట్టిన DGCA ఇప్పటికే ఇండిగోకు నోటీసు పంపింది. ప్రస్తుత పరిస్థితికి కారణాలు, అలాగే విమాన రద్దు, ఆలశ్యం జరుగుతున్నందుకు కారణాలు తెలపాలని ఆదేశించింది.
ఇక పైలట్ల సంఘం ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్’ (FIP) ఇండిగోపై తీవ్రమైన విమర్శలు చేసింది. రెండు సంవత్సరాల ముందుగానే కొత్త విధుల నియమాలు, విశ్రాంతి సమయాల నిబంధనల అమలుకు సిద్ధం కావాల్సిన అవకాశం ఉన్నప్పటికీ, సంస్థ కావాలనే హైరింగ్ ఫ్రీజ్ విధించిందని ఆరోపించింది.
సరిపడా పైలట్లు లేని పరిస్థితిలో విమానాల షెడ్యూళ్లను ఆమోదించకూడదని DGCAకు సూచించింది. DGCAకు రాసిన లేఖలో, ఇండిగో పీక్ హాలిడే, పొగమంచు సీజన్లో సర్వీసులను సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి కొనసాగితే ఆ సంస్థకు కేటాయించిన విమాన స్లాట్లను తిరిగి పరిశీలించి, వాటిని నిర్విరామంగా సేవలందించగల ఇతర విమానయాన సంస్థలకు ఇవ్వాలని FIP కోరింది. ఇండిగో సిబ్బంది సమస్యలు పరిష్కారం కానంత వరకు, విమాన ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
