భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో అల్లుడు మామపై కత్తితో దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లాలోని రామన్నపేటలో కలకలం రేపింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అత్త కూడా అల్లుడిపై ప్రతిదాడికి దిగింది. ఈ సంఘటనపై మట్టేవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మట్టేవాడ పోలీసుల వివరాల ప్రకారం, రామన్నపేటకు చెందిన రవీందర్ (55) కుమార్తె కొంతకాలంగా భర్త అనిల్ రెడ్డి (31) వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంది. భార్యను తన వద్దకు పంపించాలంటూ అనిల్ రెడ్డి మంగళవారం కుటుంబ పెద్ద ఇంటికి వెళ్లాడు.
ఈ విషయంపై మామ అల్లుడు మధ్య ఘర్షణ చెలరేగింది. వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఆవేశానికి లోనైన అనిల్ రెడ్డి కత్తితో రవీందర్ను పొడిచాడు. అల్లుడు దాడి చేయడం చూసిన అత్త ఆగ్రహంతో అక్కడున్న కత్తితోనే అనిల్ రెడ్డి పై దాడికి దిగింది. మామ రవీందర్కు, అల్లుడు అనిల్ రెడ్డికి గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వారిని వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికీ చికిత్స అందుతున్నట్లు వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న మట్టేవాడ పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని పరిశీలించారు. మామ అల్లుడు ఇద్దరికీ గాయాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కుటుంబ కలహాలు హింసాత్మక రూపం దాల్చిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
