పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలనే లక్ష్యంతో పని చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ రేంజ్ డెవలప్మెంట్ సాధించాలంటే.. ఒక నగరంలోనో.. ఒక ప్రాంతంలోనో అభివృద్ధి చేస్తే సరిపోదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు టాప్ లెవెల్లో డెవలప్ అవ్వాలి. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు అదే పని చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్రంలోని 10 ప్రధాన నగరాల్లో అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నారు. ఒక్కో సిటీలో ఒక్కో పరిశ్రమ.. ఒక్కో ప్రాంతంలో ఒక్క రంగానికి ప్రాధన్యం ఇస్తూ.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటు పడుతున్నారు.
విశాఖపట్నం కేంద్రంగా ఐటీ, ఫార్మా కంపెనీలతో పాటు పోర్టుల నిర్మాణం, టూరిజం డెవలప్మెంట్పై ఫోకస్ చేశారు. శ్రీకాకుళం ప్రాంతంలో ఫార్మా, పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రీన్ ఎనర్జీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కాకినాడలో పెట్రోలియం, గ్యాస్ ఆధారిత పరిశ్రమలతో పాటు అక్వారంగాన్ని అభివధ్ధి చేస్తున్నారు. రాజమండ్రిలో మౌలిక వసతులు, సేవలు, సాంస్కృత విభాగాలకు ఊతమిస్తున్నారు. విజయవాడను ఫైనాన్స్, వాణిజ్యం, లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దతున్నారు. గుంటూరులో వ్యవసాయ ఉత్పత్తులు.. పొగాకు, మిర్చి వంటి వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తున్నారు. ఒంగోలు కేంద్రంగా పాడి పరిశ్రమతో పాటు గ్రానైట్ ఎగుమతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
నెల్లూరులో పోర్టులతో పాటు పారిశ్రామిక కారిడార్లు, ఇండస్ట్రియల్ హబ్స్ని డెవలప్ చేస్తుండగా.. తిరుపతి కేంద్రంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, టెంపుల్ టూరిజం, ఉన్నత విద్యా కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారు. అనంతపురంలో ఆటోమొబైల్స్, సోలార్ పవర్ జనరేషన్ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కృష్ణ-గుంటూరు ప్రాంతం, దక్షిణాంధ్ర, రాయలసీమ ఇలా.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కష్టానికి రానున్న మూడేళ్లలో ఫలితం కనిపించే అవకాశం ఉంది. అప్పటికి ఏపీ ముఖచిత్రమే మారిపోతుందని చెప్పొచ్చు.
