ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా అభివృద్ధికి 2015లో 11 సంవత్సరాల క్రితమే నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. 2015 సెప్టెంబర్ 22వ తేదీన జీవో నెం.207 ద్వారా సీఆర్డీఏ(క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) రూపకల్పన చేసి ఈ ప్రాంత అభివృద్ధికి చంద్రబాబు బీజం వేశారని పేర్కొన్నారు.
ఏపీ సీఆర్డీఏ పరిది మ్యాప్ చూస్తే.. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు విజన్ ఏంటో అర్థమవుతుందని మండిపడ్డారు. ఈరోజు గౌరవ జ.మో.రె దగ్గర అభివృద్ధి పాఠాలు నేర్చుకునే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ది అంటే జగన్ రెడ్డికి నవ్వులాటలా ఉందని ఎద్దేవా చేశారు.
“2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత అన్ని ప్రాంతాల అభివృద్ధికి అప్పుడే చంద్ర బాబు నాయుడు గారు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల ఆమోదంతోనే అమరావతి రాజధానిగా ప్రతిపాదించాం. 2015లోనే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రధాన నగరాల అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించారు. “2015 సెప్టెంబర్ 22వ తేదీన జీవో నెం.207 ద్వారా సీఆర్డీఏ యాక్ట్ రూపొందించాం.
సీఆర్డీఏ పరిధిని మచిలీపట్నం దగ్గర ఉండే మోపిదేవి, ఘంటశాల, చల్లపల్లి నుండి మొదలుకొని పామర్రు, గుడివాడ నూజివీడు, మైలవరం, కొండపల్లి అటు జగ్గయపేట వరకు మరియు ఇటు గుంటురు దాటి ఎడ్లపాడు, ఫిరంగిపురం వరకు నిర్ధారించడం జరిగింది. ఆ విధంగా దాదాపు 8,350 చ.కి. మీటర్ల విస్తీర్ణంలో మచిలీపట్నం వద్ద గల మోపిదేవి నుంచి ఇటు గుంటూరు దాడి ఎడ్లపాడు వరకు సీఆర్డీఏ పరిధి ఉంది.
ఇది తెలుసుకోకుండా పిచ్చి తుగ్లక్ లా జగన్ రెడ్డి మావిగన్ పేరు ప్రతిపాదనతో కొత్త నాటకానికి తెరలేపారు. ఏపీ సీఆర్డీఏ మ్యాప్ చూస్తే.. గౌరవ జ.మో.రెకి చంద్రబాబు నాయుడు విజన్ ఏంటో తెలుస్తుంది.
సీఆర్డీఏ అంటే అమరావతి రాజధాని నగరం మాత్రమే కాదు. దాని బయట ఉన్న విజయవాడ, గుంటూరు, తెనాలి వంటి ఆరు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలతో కూడిన కోర్ రీజియన్ (Core Region) మరియు ఉయ్యూరు, నూజివీడు, పొన్నూరూ వంటి మరొక ఆరు మున్సిపాలిటీలతో కూడిన ఎక్సెడెడ్ రీజియన్ (Extended Region) అంతే కాకుండా జగ్గయ్య పేట మున్సిపాలిటీ మరియు రూరల్ మండలాలతో కూడిన పెరి ఫెరల్ ఎక్సెడెడ్ రీజియన్ (Periferral Extended Region) వంటి జోన్ లతో కూడి ఉంటుంది.
ఆ విధంగా సీఆర్డీఏ కేవలం అమరావతి రాజధాని అభివృద్ధి కోసమే కాకుండా దాని వెలుపల ఉన్నటువంటి అనేక ప్రాంతాల అభివృద్ధికి దోహద పడుతుందని తెలియజేశారు.
