ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తోంది. ప్రైవేటు జాబ్స్తో పాటు ప్రభుత్వ రంగంలోనూ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసి.. 16 వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. అదే సమయంలో 6 వేల మంది పోలీసు కానిస్టేబుల్స్ నియామకాన్ని చేపట్టారు. పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణలు తీసుకొచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఈ శాఖ పరిధిలో కొత్తగా 10 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం జాబ్ కేలండర్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు సేకరిస్తున్న అధికారులు.. పూర్తి సమాచారంతో జనవరిలో ప్రభుత్వ ఉద్యోగాల నియామక షెడ్యూల్ని తెలిపే జాబ్ కేలండర్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి జాబ్ కేలండర్ వస్తే.. గవర్నమెంట్ జాబ్స్ కోసం సన్నద్ధం అవుతున్న వాళ్లు.. షెడ్యూల్ ప్రకారం సిద్దమయ్యే ఛాన్స్ ఉంటుంది. ముందుగానే ఎగ్జామ్ డేట్ తెలియడం వల్ల.. ప్లాన్ ప్రకారం పరీక్షలకు ప్రిపర్ అవొచ్చు. రానున్న మూడేళ్లలో ఏపీ ప్రభుత్వంలో వివిధ శాఖల పరిధిలో సుమారు లక్ష పోస్టుల వరకు నియామకాలు చేపట్టే అవకాశం ఉంది.
ప్రైవేటు రంగంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. ఆ దిశగా కృషి చేస్తోంది. ఒక్క విశాఖలోనే టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి ఐటీ కంపెనీల ద్వారా లక్ష జాబ్స్ రానున్నాయి. గూగుల్,మెటా, రిలయన్స్ డేటా సెంటర్లు, సోలార్ ప్రాజెక్టుల ద్వారా మరో లక్ష జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఒక్కో రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ చేయడంతో పాటు.. అన్ని ప్రాంతాల్లో యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రణాళికలన్నీ ఆచరణలో వస్తే.. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో గణనీయమైన మార్పులు కనిపించడం ఖాయం.
