వనపర్తి జిల్లాలో అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకుంటే కలెక్టరేట్ ముట్టడి చేస్తామని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ హెచ్చరించారు. వనపర్తి జిల్లాలో సివిల్ సప్లయ్ అధికారి ఆగడాలు శృతిమించుతున్నాయని ధ్వజమెత్తారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా సివిల్ సప్లయ్ అధికారి కాశీ విశ్వనాథ్ పై గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ రకరకాల కారణాలతో డిఎస్ఓపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
జిల్లాలోని అనేకమంది అవినీతి అధికారులపై బీసీ పొలిటికల్ జెఎసి ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకున్న కలెక్టర్ డీఎస్ఓపై మాత్రం ఎందుకు ప్రేమ చూపిస్తున్నారో తెలియడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. అధికారుల ఉద్దేశం రికవరీ చేయడమా? లేక రికవరీ చేయకుండా అక్రమ కేసులు పెట్టడమా? అని ప్రశ్నించారు.
జిల్లాలో రూ.436 కోట్లు బకాయి ఉన్న వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదో డిఎస్ఓ సమాధానం చెప్పాలన్నారు. టెండర్ ప్యాడిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కోర్టు ఆదేశాలను సైతం డీఎస్ఓ తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.
తనకు అనుకూలంగా ఉండే మిల్లర్లకు ధాన్యం కేటాయిస్తూ జిల్లాలో తన సొంత చట్టాన్ని డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ అమలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకున్న కలెక్టర్ తక్షణమే డీఎస్ఓ అవినీతిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ జెఎసి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, కొత్తకోట మండల అద్యక్షుడు అంజన్న యాదవ్, శ్రీరంగాపూర్ మండల అద్యక్షుడు ధర్మేంద్ర సాగర్, జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్, నాయకులు అస్కని రమేష్, చెలిమిల్ల రామన్ గౌడ్, రమేష్, బీచుపల్లి, వేణు గౌడ్ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్
