కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 96 గదుల సత్రం నిర్మాణానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఫార్సుతో టీటీడీ ద్వారా రూ. 35.19 కోట్లు కేటాయించడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న కీలక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండగట్టు ఆలయానికి రూ. 100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించి, నయాపైసా కూడా ఇవ్వకుండా భక్తులను మోసం చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. అదే విధంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొండగట్టు ఆలయానికి చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోవడమే కాకుండా, ఆర్జిత సేవల చార్జీల పెంపు పేరుతో భక్తులపై అదనపు భారం మోపుతోందని విమర్శించారు.
భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన అన్నారు. అంజన్న ఆలయానికి సంబంధించిన వసతి సౌకర్యాల కోసం టీటీడీ రూ. 35 కోట్లకు పైగా నిధులు కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు.
దేవాలయాలపై ప్రేమ చూపిస్తున్నట్లు మాట్లాడుతున్న కాంగ్రెస్ పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కొండగట్టు ఆలయానికి తగిన నిధులు కేటాయించి అన్ని విధాలా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
