శబరిమల క్షేత్రంలో మకర జ్యోతి దర్శనమివ్వడంతో భక్తులు తన్మయులైపోయారు. శబరిమల క్షేత్రంలో మకరజ్యోతి మహోత్సవానికి దేశవ్యాప్తంగా భక్తులు హాజరయ్యారు. మరికాసేపట్లో అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం జరగుతుందనగా శబరిమల పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. మకర జ్యోతి సందర్భంగా దేశవ్యాప్తంగా నుంచి భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమలకు చేరుకున్నారు.
సాంప్రదాయం ప్రకారం పొన్నంబల మేడ నుంచి మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది. శబరిమల సన్నిధానానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబల మేడ వద్ద 3,838 అడుగుల ఎత్తులో మకర జ్యోతి వెలుగింది. ఈ పవిత్ర జ్యోతి మూడు సార్లు దర్శనం ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతోంది. మకర సంక్రాంతి అనంతరం జనవరి 19న అయ్యప్ప స్వామి వారి ఆభరణాలతో ప్రత్యేక దర్శనం నిర్వహించనున్నారు.
అదే విధంగా ఈ నెల 20న స్వామివారికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలు పూర్తైన అనంతరం శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు. మకర జ్యోతి దర్శనానికి వచ్చిన భక్తుల భద్రత, సౌకర్యాల కోసం దేవస్థాన అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయ్యప్ప నామస్మరణలతో శబరిమల క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగుతోంది.
