పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో మొహర్రం పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని శివుని బొమ్మ సెంటర్, సత్తెనపల్లి రోడ్డులోని బస్టాండ్ సెంటర్, ఐలా బజార్, నాయక్ బజార్, వరవకట్ట ప్రాంతాలలోని పీర్ల చావిడీలను నిర్వాహకులు విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు.
మొక్కుబడి తీర్చుకునేందుకు వస్తున్న భక్తులు పూలు, రంగురంగుల వస్త్రాలతో నిర్మించిన పీర్లను డప్పు వాయిద్యాల నడుమ ఇలా చావడి వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్యాగం, ధర్మం, సత్యం, మానవత్వం వంటి విలువలను చాటిచెప్పే ఈ పండుగను కుల, మత భేదాలకు అతీతంగా ప్రజలు కలిసిమెలిసి జరుపుకుంటారు.
మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులు ఉపవాస దీక్షను చేపట్టారు. పీర్లచావిడి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చావడి నిర్వహకులు భక్తులకు ప్రత్యేకంగా తయారుచేసిన షర్బత్ (బెల్లం పానకం) ను అందజేశారు. చావిడిల ఎదురుగా ఏర్పాటు చేసిన అగ్నిగుండం (అలావ్) చుట్టూ ఉత్సాహంగా అలాయ్ – బలాయ్ జరుపుకున్నారు.
చివరగా, డప్పు వాయిద్యాల నడుమ పీర్లను ఎత్తుకున్న భక్తులు అగ్నిగుండంలో నడిచి, తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం పట్టణ పురవీధులలో పీర్లను ఊరేగింపు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో మొహర్రం పండుగను కులమతాలకు అతీతంగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
మొహర్రం సందర్భంగా ఎమ్మెల్యే ప్రార్థనలు
మొహర్రం అంటేనే త్యాగం. అధర్మానికి లొంగకుండా, న్యాయం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఇమామ్ హుస్సేన్ మహోన్నత త్యాగాన్ని గుర్తు చేసుకోవాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. మొహర్రం పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే అరవింద బాబు నరసరావుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన పీర్ల చావడీలలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మొహర్రం అందరి జీవితాల్లో శాంతిని నింపాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సత్య మార్గంలోనే నడవాలనే స్ఫూర్తిని మొహర్రం పండుగ ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరినీ ధర్మ మార్గంలో నడిపించాలని ఆకాంక్షిస్తున్నాను.
