జగన్, కేసీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ప్రస్తుతం ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్.. రాజకీయంగా ఎదురీదుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటర్ పోలిటిక్స్ ద్వారా గట్టెక్కే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్ష నాయకులిద్దరూ.. ఏపీ సీఎం చంద్రబాబుని టార్గెట్ చేసుకోవడమే విచిత్రం. రాష్ట్రం విడిపోయి పుష్కర కాలం గడుస్తున్నా.. ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్లు.. ఏపీ సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారు కేసీఆర్. ఇక జగన్రెడ్డి అయితే.. కేసీఆర్ వదిలిన బాణంలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిందని.. బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు ఆధారాలతో సహా బయటపెట్టారు. కానీ వైసీపీ మీడియాలో ఈ వార్త కనిపించదు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి.. కూటమి పాలనలో రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయిందని బ్లూ మీడియా అసత్య ప్రచారం ప్రారంభించింది. వైసీపీ క్రియేట్ చేసిన అబద్దాలు.. బీఆర్ఎస్ మీడియాలో కనిపించవు. అంటే రెండు పార్టీలు ఒకరికి ఒకరు సహకరించుకొంటున్నాయని స్పష్టమవుతోంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. కేసీఆర్ పాలనలో వేసిన కేసు కారణంగా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఆగిపోతే.. ఎన్జీటీ స్టే ఎత్తేసి.. మళ్లీ పనులు ప్రారంభించడానికి అప్పటి జగన్ సర్కారు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఈ నేపథ్యంలో.. రాయలసీమ లిఫ్ట్ మట్టి పనులు చేసి పక్కనపెట్టడమే సీమకు మేలు చేయడం అవుతుందా అని తెలుగుదేశం శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
ఏటా సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు తరలించాలని కూటమి ప్రభుత్వం నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుని ప్లాన్ చేసింది. ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమకు జీవనాధారం లాంటి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎంత రాద్దాంతం చేస్తున్నా.. వైసీపీ నుంచి చిన్న రియాక్షన్ కూడా లేదు. చంద్రబాబు పాలనలో కరువు సీమకు గోదావరి జలాలు తరలిస్తే.. వైసీపీ దుకాణం కట్టేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకోవడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు వైసీపీ సైలెంట్ సపోర్టర్గా నిలుస్తోంది. దీన్ని కదా రాయలసీమకు ద్రోహం అనాల్సింది. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా.. మౌనంగా ఉన్న వైఎస్ జగన్.. కేసీఆర్ వదిలిన బాణం అనడం కరెక్టా.. కాదా అనేది.. ఆంధ్రప్రదేశ్ ప్రజలే తేల్చుకోవాలి.
