నర్సీపట్నం ప్రజల ఆరాధ్య దైవం మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, కుటుంబ సభ్యులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం విజయ్ మాట్లాడుతూ నర్సీపట్నం ప్రజలకు ఇదొక సొంత పండుగ అని, యువత ఈ సంబరాల్లో చురుకుగా పాల్గొనడం సంతోషకరమని అన్నారు. జాతరలో భారీ క్రాకర్స్ షోతో పాటు గోపురానికి కూల్ ఫైర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకోవాలని, భద్రతా విధుల్లో ఉన్న పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
వృద్ధులు క్యూలైన్లలో ఇబ్బంది పడకుండా సహాయకులను వెంట తెచ్చుకోవాలని, భక్తుల కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అంబులెన్స్ సౌకర్యాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇదే ప్రాంతంలో సృష్టి క్షేత్రాన్ని అభివృద్ధి చేసి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని నిర్మిస్తున్నామని, దీనివల్ల పర్యాటకం పెరిగి స్థానిక చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.
గ్రేడ్-1 మున్సిపాలిటీగా మారిన నర్సీపట్నాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, ఈ జాతరను ప్రజలంతా సమన్వయంతో విజయవంతం చేయాలని విజయ్ పిలుపునిచ్చారు.
రిపోర్టర్ శివ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం
