ప్రభుత్వం కొత్తగా బి టి రోడ్డు నిర్మించిందని ఇక నుండి గతుకులు లేని దుమ్ము ధూళి లేని ప్రయాణం చేయవచ్చని ఆ గ్రామాల ప్రజలు పడ్డ ముచ్చట మూన్నాళ్ల కే ఆవిరై పోయింది. కొత్తగా నిర్మించిన తారు రోడ్డు కొద్ది రోజులకే ధ్వంసం అయ్యి పోయింది. ఈ రహదారి కేవలం కమీషన్ ల కోసమే నిర్మించి ఉంటారని ప్రయాణికులు విమర్శించుకుంటున్నారు.
రోడ్డు పై బేబీ సిప్స్ పల్చగా పేర్చి పేడ పూసినట్టు తారు పూసి వదిలేశారని, నాణ్యతా ప్రమాణాలకు నిలువునా పాత రేశారని ప్రజలు చెప్పుకుంటున్నారు. వివరాలలోకేళితే ఏలూరు జిల్లా పోలవరం నియోజక వర్గ పరిధిలో ఉన్న టి నరసాపురం మండలం జగ్గవరం గ్రామం నుండి అల్లంచెర్ల, కొత్త గూడెం గ్రామాల మీదగా కామవరపు కోట అడ్డ రోడ్డు వరకు కొన్నాళ్ళ కింద బి టి రోడ్డు నిర్మించారు.
ఈ రోడ్డు నిర్మాణం పై అధికారుల పరిశీలన జరగలేదా, నిర్మించిన తరువాత క్వాలిటీ కంట్రోల్ శాఖాధికారులు రోడ్డు వెంబడి మెటీరియల్ పర్సెంటేజ్ లోపాలను గుర్తించలేదా, అనుమానం ఉన్న ప్రతి చోట రోడ్డు మధ్య మధ్యలో నాణ్యతా ప్రమాణాలను తవ్వి తీసి కొలవలేదా అంటూ అనేక ప్రశ్నలు ప్రజలు వేసుకుంటున్నారు. దీనిపై జంగారెడ్డి గూడెం ఆర్ అండ్ బి డివిజన్ డి ఈ హరికృష్ణ ని సత్యంన్యూస్ మంగళవారం వివరణ కోరింది.
డి ఈ హరికృష్ణ స్పందిస్తూ కామవరపు కోట అడ్డ రోడ్డు నుండి జగ్గవరం వరకు 8 కిలోమీటర్ల రహదారికి 2.50 కోట్ల నిధులతో మే నెలలో బి టి రోడ్డు నిర్మించినట్టు తెలిపారు. 20mms పరిమాణం గల మెటీరియల్ తో 4.2శాతం తారు తో నిర్మించిన ఈ రహదారి వర్షా కాలం లో నిర్మించడం జరిగిందని చెప్పారు. ఈ రహదారిపై టిప్పర్ లు, పామాయిల్ హెవీ లోడ్ లతో లారీలు నడపడం తో రహదారి పాడైపోయిందని వివరించారు.
ఈ రహదారి నిర్మించిన కాంట్రాక్టర్ కి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని డి ఈ తెలిపారు. పాడైపోయిన ఈ రహదారిని మళ్ళీ నిర్మించడానికి కాంట్రాక్టర్ తో మాట్లాదామన్నారు. మరో రెండు రోజుల్లో పనులు ప్రారంభించి వారం రోజుల్లో పూర్తిచేయనున్నామని డి ఈ హరికృష్ణ వివరణ ఇచ్చారు.
