వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో చోటుచేసుకున్న ఘోర విస్ఫోటనం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ బాధితులను పరామర్శించి ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఇప్పటికే 23 మంది కార్మికులు మృతి చెందగా మరికొందరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని, ఇది సాధారణ ప్రమాదం కాదని, భద్రతా ప్రమాణాల అమలులో జరిగిన ఘోర నిర్లక్ష్యానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బాణాసంచా యజమానిపై మాత్రమే కాకుండా, తనిఖీలు నిర్వహించాల్సిన అనుమతులు ఇచ్చిన సంబంధిత అధికారులపై కూడా హత్య నేరం కింద కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కేవలం సస్పెన్షన్తో సరిపెట్టడం బాధిత కుటుంబాలకు న్యాయం చేయడం కాదని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేసిన నలుగురు అధికారులపై కూడా క్రిమినల్ బాధ్యత నిర్ధారించి అరెస్టు చేయాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన రూ.22 లక్షల పరిహారం తగినది కాదని, మృతి చెందిన వారంతా పేద కుటుంబాలకు చెందినవారే కావడంతో పరిహారాన్ని కనీసం రూ.50 లక్షలకు పెంచాలని, గాయపడిన వారికి పూర్తిస్థాయి ఉచిత వైద్యం కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని ఆయన కోరారు.
వేట్లపాలెం ఘటన రాష్ట్రంలో ప్రమాదకర పరిశ్రమల పర్యవేక్షణ వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తిందని, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బాధ్యులపై కఠిన చర్యలే మార్గమని మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు.
