హైదరాబాద్ గౌలిపుర మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశు సంవర్ధక, మత్స్య,యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు, సాంస్కృతిక వైభవానికి బోనాల పండుగ అద్దం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.వరసగా రెండేళ్లు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నానని మంత్రి తెలిపారు.
అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు.
మంత్రి రాక సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభం తో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు తెలంగాణ గొర్రెల, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ సరిత తిరుపతయ్య యాదవ్,స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
