ఎంత పెద్ద ఎయిర్లైన్ అయినా, ప్రణాళికా వైఫల్యాలు లేదా నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేందుకు అనుమతించబోమని సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్ మోహన్ నాయుడు మంగళవారం లోక్సభలో స్పష్టం చేశారు.
ఇండిగో విమానాల భారీ అంతరాయాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండిగోపై ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ) నోటీసులు జారీ చేసిందని, సిబ్బంది రోస్టరింగ్లోని అంతర్గత వైఫల్యాల కారణంగా ఏర్పడిన గందరగోళానికి కంపెనీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఇండిగో విమాన షెడ్యూళ్లు క్రమంగా స్థిరపడుతున్నాయని, దేశవ్యాప్తంగా మిగతా అన్ని ఎయిర్లైన్స్ సాధారణంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. విమాన రద్దుల వల్ల నష్టపోయిన ప్రయాణికులకు తక్షణమే రీఫండ్ ఇవ్వాలని ఆదేశించగా, ఇప్పటికే రూ.750 కోట్లకు పైగా ప్రయాణికుల ఖాతాల్లో జమ అయ్యాయని మంత్రి వివరించారు.
దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో పరిస్థితులు సర్వసాధారణంగా ఉన్నాయని, ఎక్కడా రద్దీ లేదా ఇబ్బందులు లేవని చెప్పారు. రీఫండ్లు, బాగేజీ ట్రేసింగ్, ప్రయాణికుల సహాయం వంటి అంశాలను మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఇండిగో సీనియర్ లీడర్షిప్కు షోకాజ్ నోటీసులు జారీ చేసి, డిజిసిఏ సమగ్ర విచారణ ప్రారంభించిందని, దాని నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని నాయుడు హెచ్చరించారు.
దేశంలోని విమానయాన రంగాన్ని బలంతో, పోటీతత్వంతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కొత్త ఎయిర్లైన్స్ను ప్రోత్సహించే విధానాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. సివిల్ ఏవియేషన్ రంగంలో భద్రత ఎట్టి పరిస్థితుల్లోను రాజీ పడనిదని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి వివరణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రతిపక్ష పార్టీలు లోక్సభ నుంచి వాక్అవుట్ చేశాయి.
