బెంగళూరు సమస్యలు.. అనంతపురం జిల్లాకు అనుకోని అవకాశంగా మారాయి. గార్డెన్ సిటీలో భూముల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ సామాన్యులు భరించలేని స్థాయికి చేరింది. బెంగళూరు మహా నగరంలో కొత్తగా కంపెనీలు పెట్టడానికి స్థలాలు అందుబాటులో లేవు. వీటికి తోడు ట్రాఫిక్ జామ్లు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇన్ని సమస్యల నడుమ బెంగళూరు ఎకో సిస్టమ్ ఆధారంగా డెవలప్ అవ్వాలనుకొనే కంపెనీలకు ఏపీ సరిహద్దులోని ఉమ్మడి అనంతపురం జిల్లా బెస్ట్ డెస్టినేషన్గా మారుతోంది.
ముఖ్యంగా హిందూపురం, రాప్తాడు, పుట్టపర్తి మడకశిర నియోజకవర్గాల్లో చౌకగా.. వేల ఎకరాలు అందుబాటులో ఉండటం.. భారీ సంస్థలను ఆకర్షించడానికి ఉపయోగపడుతోంది. బెంగళూరు కేంద్రంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ ఈ రంగంలో అభివృద్ధి చెందింది. ఈ సంస్థకు అనుబంధంగా లేదా పోటీగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. ఇప్పుడు అలాంటి కంపెనీలన్నీ భారీగా విస్తరించాలనే ఆలోచనలో ఉన్నాయి.
విమానయాన రంగంలోని కంపెనీలకు వందల ఎకరాలు కావాలి. కానీ బెంగళూరులో కాదు కదా.. సిటీ వంద కిలోమీటర్ల వరకు ఎక్కడ భూములు అందుబాటులో లేవు. ఎక్కడైనా ఉన్నా వాటి రేట్లు చుక్కల్లో ఉంటాయి. ఒకేచోట వందల ఎకరాలు సేకరించడం మరో ప్రధాన సమస్య. ఇలాంటి కారణాలతో ఎయిరో స్పేస్ రంగానికి చెందిన కంపెనీలు ప్రత్యామ్నాయం కోసం వెతుకుంటే.. వాటికి ఏపీలోని అనంతపురం జిల్లా అన్ని రకాలుగా అనువైన ప్రాంతంగా కనిపించింది.
బెంగళూరు సమీపంలో కొత్తగా కంపెనీ ప్రారంభించాలనుకొనే సంస్థలకు ఏపీ మంత్రి నారా లోకేశ్ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. కంపెనీకి అవసరమైన భూములు, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు.. పన్ను రాయితీలు ఇతర ప్రోత్సాహాకాలు ఇస్తామంటూ ఆహ్వానం పలుకుతున్నారు. ఏపీ ఆఫర్తో బెంగళూరుకు చెందిన భారీ కంపెనీ ఏపీ వైపు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే భారత్ ఫోర్జ్తో పాటు రేమాండ్ గ్రూపునకు చెందిన సంస్థలు అనంతపురం జిల్లాలో విమానాలు విడి భాగాల తయారీ పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చాయి.
ఎయిర్బస్, రోల్స్ రాయిస్ వంటి అంతర్జాతీయ ఏరోస్పేస్ దిగ్గజాలను కూడా ఏపీకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నలు చేస్తోంది. ఏపీ సర్కారు ప్రయత్నాలు నెమ్మదిగా ఫలితాలు ఇస్తున్నాయి. త్వరలో విమానాలు, డ్రోన్ల తాయరీకి కర్నూలు, అనంతపురం జిల్లాలు కేరాఫ్ అడ్రస్ మారడం ఖాయంగా కనిపిస్తోంది.
