27.3 C
Hyderabad
September 16, 2026
ఆధ్యాత్మికంహోమ్

రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు

#Indrakeeladri

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ‘వార్షిక పవిత్రోత్సవాలు’ గురువారం (ఆగస్టు 27వ తేదీ) నుండి అత్యంత శాస్త్రోక్తంగా, వైభవంగా ప్రారంభం కానున్నాయని ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.

​ఆలయంలో నిత్య కైంకర్యాలు, అర్చనలు, పూజలు జరిగే సమయంలో తెలిసి లేదా తెలియక జరిగే దోషాలు, స్పర్శ దోషాలు,లోపాలు,అశుచులు తొలగిపోయి ఆలయ పవిత్రత పరిపూర్ణంగా నిలిచేందుకు ఆగమ శాస్త్రోక్తంగా ప్రతి ఏటా నిర్వహించే విశేష మహోత్సవమే ఈ ‘పవిత్రోత్సవం’.

రంగురంగుల పట్టు దారాలతో ప్రత్యేకంగా రూపొందించిన పవిత్ర మాలలను ప్రధాన దేవతలకు,పరివార దేవతలకు ధరింపజేసి, హోమ క్రతువులు నిర్వహించడం ద్వారా ఇంద్రకీలాద్రి క్షేత్రానికి విశేషమైన ఆధ్యాత్మిక తేజస్సు సమకూరుతుందని పురాణోక్తి.

ఉత్సవాల మొదటి రోజైన ఆగస్టు 27 (గురువారం) తెల్లవారుజామున 3:00 గంటలకు శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయంలో శాస్త్రోక్తంగా సుప్రభాత సేవ నిర్వహిస్తారు. అనంతరం శ్రీ అమ్మవారి మూలవిరాట్‌కు అర్చక పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య దివ్యమైన స్నపనాభిషేకం, పవిత్ర మాలాధారణ మహోత్సవాన్ని జరిపిస్తారు.

ప్రధాన ఆలయంలో సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, పవిత్రాలంకరణ క్రతువులు పూర్తయ్యేంత వరకు  దర్శనాలు నిలిపివేయబడతాయని, ఉదయం 8:00 గంటల తర్వాతే భక్తులకు శ్రీ అమ్మవారి సర్వదర్శనం కల్పించడం జరుగుతుందని తెలియజేసారు.

​భక్తులు ఉదయం 8:00 గంటల తర్వాత మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుందనే విషయాన్ని గమనించి, దేవస్థాన ఏర్పాట్లకు అనుగుణంగా తమ దర్శన సమయాలను ప్రణాళిక చేసుకోవాలని ఈవో శీనానాయక్ కోరారు.

​పవిత్రోత్సవాల సందర్భంగా నిర్వహించే వివిధ వైదిక హోమాలు, జపాలు,మూల మంత్ర హవనములు తదితర కార్యక్రమాలకు దేవస్థానం సర్వసన్నద్ధమైంది.

Related posts

ముంబైని ముంచేసిన భారీ వర్షం

Satyam News

ఒక్కటైన రష్మిక మందన విజయ్ దేవరకొండ

Satyam News

ఏపీకి కేంద్రం భారీ గ్రాంట్‌… పంచాయితీలకు పండగ

Satyam News

శ్రీ మదనగోపాలస్వామి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం

Satyam News

ఆవుల‌ను త‌ర‌లిస్తే ఖ‌బ‌డ్దార్‌: అర్ద‌రాత్రి ఎస్పీ త‌నిఖీలు

Satyam News

ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కొనసాగింపు

Satyam News

Leave a Comment