రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతుందని ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. శనివారం కృష్ణా(జి) కానుమోలు 45.8 డిగ్రీలు, అనకాపల్లి(జి) మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు నమోదైందన్నారు. అలాగే రాష్ట్రంలోని 28 జిల్లాలకు గాను 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు.
ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. తప్పనిసరి ప్రయాణాల్లో మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలన్నారు. అలాగే రేపు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.
వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నమోదైయ్యే మండలాల పూర్తి వివరాలు లింక్ లో:
https://apsdma.ap.gov.in/files/5dcb3b1755e32ba3f3f8a4347dad5f8b.pdf
మే 24 ఆదివారం
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 – 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, అనకాపల్లి,కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42- 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 – 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
మరోవైపు ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. దీని ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మన్యం, అల్లురి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఉరుములతో వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు చెట్ల క్రింద నిలబడరాదని వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు.
శనివారం కృష్ణా(జి) కానుమోలు 45.8 డిగ్రీలు, అనకాపల్లి(జి) మాకవరపాలెంలో 45.5, ఏలూరు(జి) కుక్కునూరు, పోలవరం(జి) కూనవరం, పల్నాడు(జి) శ్రీనగర్ 45,ఎన్టీఆర్ (జి) తొర్రగుడిపాడులో 44.6, తూర్పుగోదావరి(జి) చిట్యాలలో 44.3, విశాఖ రూరల్లో 42.8, అల్లూరి(జి) రామరాజుపాలెం, కాకినాడ(జి) కోటనందూరులో 42.6, మార్కాపురం(జి) నందనామారెళ్లలో 42.5, ప్రకాశం(జి) కొండపిలో 42.4, గుంటూరు(జి) రాయపడి 42.3డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
