కడప జిల్లా జాతీయ స్థాయిలో అగ్ర స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కార్యక్రమంలో.. కడప జిల్లా టాప్ ప్లేస్లో నిలిచింది. దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. జాతీయ స్థాయిలో మొత్తం 112 జిల్లాలను ఎంపిక చేశారు. వీటిలో ఏపీ నుంచి అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, వైఎస్సార్ కడప జిల్లాలు ఎంపికయ్యాయి.
జిల్లా నుంచి ఇద్దరు నాయకులు ముఖ్యమంత్రులు అయ్యారు. వారిలో ఒకరి పేరు మీదుగా వైఎస్సార్ కడప జిల్లా అని నామకరణం చేశారు. అయినా కూడా .. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం వంటి కొండ ప్రాంతాలతో కూడిన గిరిజన జిల్లాల స్థాయిలో కడప జిల్లా వెనుకబడి ఉండటం దురదృష్టకరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కడప అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వైసీపీ అధినేత సొంత జిల్లా అనే వివక్షకు తావులేకుండా.. వెనుకబడిన ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి పట్టుదలతో కృషి చేశారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు సాగునీటిని సరఫరా చేసిన సీఎం చంద్రబాబు.. మళ్లీ తన హయాంలోనే పులివెందులకు సాగు తాగునీటిని అందించే పథకాన్ని పూర్తి చేస్తున్నారు.
ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్లో భాగంగా.. మాతా-శిశు ఆరోగ్య సంరక్షణ… విద్యా రంగంలో మౌళిక వసతుల కల్పన… ప్రకృతి వ్యవసాయంలో ప్రోత్సాహం… బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, రైతులు – పేదలకు రుణ సదుపాయం విస్తరణ… యువతలో నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పన వంటి అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు.. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ప్రత్యేక గ్రాంట్లను సమర్ధంగా వినియోగించుకున్న జిల్లాలకు ర్యాంకులు ఇచ్చారు. ఇందులో కడప జిల్లాకు మొదటి స్థానం దక్కింది. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సారధ్యంలో అధికారులంతా సమిష్టి కృషితో ఈ ఘనత సాధించారు. ఇదే స్ఫూర్తితో కడపను వెనుకబడిన జిల్లాల జాబితా నుంచి అభివృద్ధి చెందిన జిల్లాల లిస్టులో చేర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
