పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ (సి ఎస్ ఎం ఆర్ ఎస్) బృందం మంగళవారం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు మరో రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ బృందంలో సి ఎస్ ఎం ఆర్ ఎస్ లోని మట్టి, వివిధ పదార్ధాల పరీక్షల నిపుణులు హరేంద్ర ప్రకాష్, అవినాష్ ఆనంద్ శ్రీవాస్తవ, గౌరవ్ పాండియా , విజయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు.
వీరు మంగళవారం ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ లో మట్టి, ఇసుకల నాణ్యతను పరీక్షించారు. ఈసీఆర్ఎఫ్ లో బంకమట్టి, కొద్దిగా ఇసుక కలిసినట్లుగా ఉండే మట్టిని వినియోగిస్తున్నారు. ఒక్కో దొంతరకు ఒక్కో మట్టిని నిపుణుల సూచన మేరకు వినియోగిస్తున్నారు.
ప్రతి దొంతరకు వినియోగించే మట్టి, ఇసుక, రాళ్ల నాణ్యతను పరీక్షించాల్సిందిగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సి ఎస్ ఎం ఆర్ ఎస్ నిపుణుల్ని కోరింది. వారు ప్రతి నెలా పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో భాగంగా రెండు రకాల మట్టి, ఇసుక నాణ్యతని నిపుణులు పరీక్షించారు.
ఈ పరీక్షల్లో అవి నాణ్యతగా ఉన్నాయని తేలింది. బుధ, గురువారాల్లో ఇదే తరహా పరీక్షలను ఈ బృందం నిర్వహించనుంది. సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం వెంట జలవనరుల శాఖ ఈఈ శ్రీనివాస్, డి ఈ నిర్మల ఎం ఈ ఐ ఎల్ పోలవరం ప్రాజెక్ట్ జి ఎం ఏ గంగాధర్, డి జి ఎం లు మురళి పమ్మి, గుట్టపాటి శంకరయ్య, వ్యాప్కోస్ అధికారులు ఉన్నారు.
