ప్రత్యేక ఓటరు సవరణ లో తప్పిదాలు జరిగితే ఊరుకోబోమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన పద్మారావు నగర్ లోని SIR కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమం నిర్వహణ తీరు, సిబ్బంది విధులు, ఓటరు మ్యాపింగ్ విధానం గురించి AERO సుజాత, సంబంధిత అధికారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు.
అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ SIR కార్యక్రమంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, ప్రజలు కూడా తప్పని సరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, తమ ఓటును జాబితాలో ఉండేలా జాగ్రత్త పడాలని చెప్పారు. SIR కార్యక్రమంలో సాంకేతికత అనుభవం కలిగిన సిబ్బందిని నియమించాలని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
స్వీపర్లను కూడా SIR కార్యక్రమంలో సిబ్బందిగా నియమించినట్లు మా దృష్టికి వచ్చిందని, యాప్ ను డౌన్ లోడ్ చేయడం, వివరాలు నమోదు చేయడం వంటి విషయాలలో ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు. ఓటు షిఫ్టింగ్ కు సంబంధించి ఇంటి యజమాని వివరాలు ఇవ్వాలని చెప్పడం సరైనది కాదన్నారు.
మరణించిన వారి పేరు ను ఓటరు జాబితా నుండి తొలగించాలంటే కుటుంబ సభ్యులు డెత్ సర్టిఫికెట్ తేవాలని చెప్పడం కూడా కరెక్ట్ కాదన్నారు. ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ప్రజలకు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉంటారని, వారి సహకారాన్ని తీసుకోవాలని కోరారు.
ప్రతిసారి ఎన్నికల సమయంలో తమ పేరు ఓటరు జాబితాలో లేదని, ఆందోళన కు గురవుతుంటారని, అలాంటి పరిస్థితులు రాకుండా నెల ఈ కార్యక్రమంలో ప్రజలు జాగ్రత్త పడాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే వెంట పద్మారావు నగర్ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు లక్ష్మీపతి, అంబులెన్స్ సురేష్, శ్రీకాంత్ రెడ్డి, రమణ, శైలేందర్, మిట్టపల్లి బాబూరావు, సుధాకర్ రెడ్డి, వెంకట్, నాగలక్ష్మి, అనిత తదితరులు ఉన్నారు.
