ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ కు మరొక సారి బ్రేక్ పడింది. దాంతో తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మరోసారి బ్రేక్ వేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మద్దతు ఇంకా స్పష్టంగా నిరూపించలేదని విజయ్కు వివరించినట్లు తమిళనాడు లోక్ భవన్ ప్రకటన విడుదల చేసింది.
బుధవారం జరిగిన భేటీ తర్వాత గురువారం మరోసారి విజయ్ గవర్నర్ను కలిశారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇంకా స్థిరంగా లేదని గవర్నర్ స్పష్టం చేసినట్లు లోక్ భవన్ తెలిపింది. ఏప్రిల్ 23న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీకి ఇంకా 10 స్థానాలు తక్కువగా ఉన్నాయి. ఐదు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించింది. దీంతో విజయ్ తనకు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ గవర్నర్కు జాబితా సమర్పించారు.
అయితే విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానించకపోవడంతో చెన్నైలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుప్పూర్ జిల్లా నుంచి వచ్చిన టీవీకే కార్యకర్తలు లోక్ భవన్ బయట ఆందోళనకు దిగారు. మెజారిటీ నిరూపణకు రాజ్ భవన్ సరైన వేదిక కాదని, అసెంబ్లీలోనే బలపరీక్ష జరగాలని వారు డిమాండ్ చేశారు. ఎస్ ఆర్ బొమ్మై తీర్పును ప్రస్తావిస్తూ, అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడం గవర్నర్ రాజ్యాంగబద్ధ బాధ్యత అని పేర్కొన్నారు.
గవర్నర్ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కూడా టీవీకే కార్యకర్తలు ఆరోపించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో పోలీసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
విజయ్ ఈరోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశించిన కార్యకర్తలు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం జరిగే వరకు చెన్నైలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటు చుట్టూ మరింత ఉత్కంఠ నెలకొంది.
