చాలా మంది కింద నుంచి మొదలు పెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయంలో మాత్రం అంతా రివర్స్లోనే జరుగుతోంది. ఆయన ప్రారంభించడమే ఎవరెస్ట్ అంత ఎత్తులో ఆరంభించారు. రాజకీయాల్లోకి వస్తూనే తనకు అండగా నిలిచే వర్గాల్లో.. తాత, తండ్రులను మించిన మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
వారసత్వంగానే వచ్చినా.. మొదటి నుంచి.. పార్టీ బేస్లో జగన్కి తిరుగులేని ఫాలోయింగ్ ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా గతంలో ఎప్పుడూ, ఎవరికీ రానంత భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఎంత త్వరగా.. ఎంత ఎత్తుకు ఎదిగారో.. అంతకు సగం సమయంలోనే పాతాళానికి మించిన లోతుల్లోకి పడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోవడమే ఘోర పరాజయం అనుకుంటే.. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ డిపాజిట్లు కోల్పోవడం అంతకంటే దారుణ పరాభవం.
పరిస్థితి ఇలాగే ఉంటే.. వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్ గెలవడమూ కష్టమే అనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. పోలిటికల్ పండితుల జోస్యం నిజం అవుతుందని భయపడ్డారో ఏమోగానీ.. జగన్రెడ్డి యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. మొదటి నుంచి పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నా.. నియోజకవర్గ ప్రజలకు ఆయన దర్శన భాగ్యం దొరకడం గగనం అనే పరిస్ఙితులు ఉండేవి.
ఇప్పటికీ ప్రజల ముందు వెళ్లకపోతే.. తనను మర్చిపోతారని అనుకున్నారో ఏమో.. ఈసారి పులివెందుల పర్యటనలో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు వైఎస్ జగన్. మంగళగిరిలో నారా లోకేశ్ ప్రజాదర్బార్కి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. ఆయన పార్టీ ఆఫీసుకు వస్తున్నారంటే వేలాది మంది క్యూ కడుతున్నారు. పబ్లిక్లో మంత్రి లోకేశ్కి పెరుగుతున్న పాపులారిటీ చూశాక.. జగన్ కూడా ఆయన బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ పునాదులు కదిలిపోతున్న సమయంలో.. ఎట్టకేలకు అక్కడి ప్రజలను కలవడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ కార్యక్రమం అయినా ఆర్గానిక్గా.. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా జరుగుతుందా.. లేక గతంలో ఎప్పుడూ రోటీన్గా చేసే స్కిట్ల మాదిరిగా పబ్లిసిటీ స్టంట్గా మిగిలిపోతుందా.. అనేదే పెద్ద ప్రశ్న. పులివెందుల ప్రజలకైతే రెండు రోజుల్లోనే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అక్కడి నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందో.. మనమూ చూద్దాం..
