అభివృద్ధి, సమగ్ర సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణను ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి వేగం కొనసాగుతుందని ఆయన అన్నారు.
సోమవారం మధిరలో మీడియాతో మాట్లాడిన భట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద మున్సిపల్, విద్యా శాఖలు ఉండటంతో పట్టణాభివృద్ధి, విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మురుగు నీటి శుద్ధికి ఎస్టీపీలను మంజూరు చేశామని, పట్టణాల్లో ఆసుపత్రులు, విద్యా సంస్థలు, విద్యుత్ రంగాల్లో ఆధునికీకరణ పనులు చేపడుతున్నామని తెలిపారు.
గతంలో ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా వచ్చేవని, ప్రస్తుతం ప్రతి నెల తొలి తేదీన జీతాలు జమ చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి కోటి రూపాయల ప్రమాద బీమా అమలు చేస్తున్నామని తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు, మేలు రకం బియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు.
వడ్డీ లేని రుణాల కింద మహిళలకు రూ.27 వేల కోట్ల చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు.భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మధిర పట్టణ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, వరద నివారణకు రిటైనింగ్ వాల్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీపీలు, పార్కులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ‘మై మధిర – క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.
