మానుకోటలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార ర్యాలీలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ అసలైన సమస్యలను పక్కన పెట్టి, అనవసరమైన అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మహాత్మా గాంధీ దేశానికి జాతిపిత అనే విషయంలో ఎలాంటి సందేహం లేదని, అయితే తెలంగాణ విషయానికి వస్తే సాయుధ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి మాత్రమే తెలంగాణ జాతిపిత అని ఆయన స్పష్టం చేశారు. నాడు జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీ ఓట్లు సాధించిన ఘనత రావి నారాయణ రెడ్డిదేనని గుర్తు చేశారు.
ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ‘పేటెంట్ రైట్’ మాత్రం ఖచ్చితంగా కేసీఆర్కే దక్కుతుందని నారాయణ అభిప్రాయపడ్డారు.
ఇదే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్పై నారాయణ తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు గుప్పించారు.
సుమారు 60 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, అప్పుడే 5 శాతం కమిషన్లు వసూలు చేసినట్లు సమాచారం ఉందని ఆరోపించారు. “అలులేదు చూలులేదు కొడుకు పేరు సోమలింగం” అన్న చందంగా, కనీసం మున్సిపల్ ఎన్నికలే పూర్తి కాకముందే, గెలుపోటములు తేలకముందే అవినీతికి తెరలేపడం దారుణమన్నారు.
ఫలితాలు రాకముందే అవినీతి కూతలు కూయడం ఎమ్మెల్యే పనితీరుకు నిదర్శనమని ఆయన విమర్శించారు.
