మేడారం సమీపంలోని జంపన్నవాగులోకి పూర్తి స్థాయిలో నీరు చేరడంతో పరిసర ప్రాంతాలు జలకళను సంతరించుకున్నాయి. లక్నవరం సరస్సు నుంచి నీటిని విడుదల చేయడంతో జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తూ భక్తులను ఆకట్టుకుంటోంది.
వాగులో నీరు ప్రవహించడంతో అక్కడికి వచ్చిన భక్తులు పులకరించిపోతున్నారు. సహజసిద్ధమైన జలప్రవాహాన్ని వీక్షిస్తూ భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతరకు ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన జంపన్నవాగులో జలకళ కనిపించడంతో పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. అయితే వాగులో నీటి ప్రవాహం పెరగడంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
భక్తులు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. వాగులో నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఇసుక బస్తాలతో తాత్కాలిక చెక్డ్యామ్లను ఏర్పాటు చేశారు. భక్తుల భద్రతే లక్ష్యంగా తీసుకుని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
