ఎర్రబస్సు కామెంట్ జగన్ క్రెడిట్ కథలకు చెక్ పెట్టడంతో పాటు వైసీపీని ముంచేసింది. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ కోసం ఆరాటపడుతూ.. వైసీపీ నేతలు ఎంత పోరాటం చేసినా ప్రజలు నమ్మడం లేదు. విమానాశ్రయం ప్రారంభోత్సవం తర్వాత చివరాఖరి ప్రయత్నంగా సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు.
కానీ ఆయన కవర్ డ్రైవ్ బూమరాంగ్ అయింది. ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకు అని జగన్ అనలేదని.. ఎవరో చెప్పిన మాటలనే రిపీట్ చేశారని కవరింగ్ చేసినా.. ఎవరూ నమ్మలేదు. కానీ ఈ ప్రెస్మీట్ ద్వారా భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకు అని జగన్ చెప్పడం నిజమేనని సజ్జల ఒప్పుకున్నట్లయింది.
అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై కూటమి పార్టీల నేతలు మొదటి నుంచి తమ పాలనలో రికార్డు సమయంలో పూర్తి చేశామని ప్రచారం చేసుకున్నారే తప్ప వైసీపీని టార్గెట్ చేయలేదు. భోగాపురం క్రెడిట్ మాదే అని జగన్తో పాటు ఆ పార్టీ నేతలు సొంత డప్పు కొట్టుకోవడంతో.. చాలా మంది మర్చిపోయిన విషయాలు.. ఎవరికీ తెలియని సంగతులు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇది ముమ్మాటికీ జగన్ వేసుకున్న సెల్ఫ్ గోల్. టీమ్ మొత్తాన్ని ఆల్ ఔట్ చేసిన హిట్ వికెట్ అని చెప్పడంలో తప్పు లేదు.
వైసీపీ అధికారంలోకి వస్తే భూసేకరణ ద్వారా తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేస్తామని.. విశాఖ ఎయిర్పోర్టు కోసం 2700 ఎకరాలు ఎందుకని అప్పట్లో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఈ కామెంట్స్తో వైసీపీ హయాంలోనే భూసేకరణ పూర్తి చేశామని చెప్పండం శుద్ధ అబద్దమని తేలిపోయింది. ఎర్ర బస్సు కూడా రాని ఊరికి ఎయిర్ పోర్టు ఎందుకు అనడం ఎంత పెద్ద పొరపాటో.. జగన్తో పాటు వైసీపీ నాయకులకు చాలా ఆలస్యంగా అర్ధమైంది.
గతంలో ఏం చేశాము.. ఎలాంటి మాటలు వదిలాము అనేది మర్చిపోయి.. అందమైన అబద్దాలు చెప్పినంత మాత్రాన చరిత్ర మారిపోదు. ఈ సోషల్ మీడియా కాలంలో.. గతం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ముందు వెనుకా ఆలోచించకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడే జగన్ బ్యాచ్.. గతంలో చేసిన తప్పుల వల్లే భవిష్యత్తు లేకుండా పోయింది.
