రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కార్వాన్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు.
శ్రీ దర్బార్ మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ దేవాలయం కు చేరుకోవాలని ఆలయ అర్చకులు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉన్నత అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి మంత్రి ని స్వాగతించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మంత్రి దామోదర్ రాజనర్సింహ పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఆషాడమాసం ను పురస్కరించుకొని ముఖ్యంగా జంట నగరాలలోని ప్రజలు, భక్తులు ఎంతో వైభవంగా బోనాలు పండుగను నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారన్నారు. కార్వాన్ లోని శ్రీ దర్బార్ మైసమ్మ అమ్మవారికీ పట్టు వస్త్రాలను సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాంతంతో సుమారు 45 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఈ ప్రాంతంలో దివంగత జగత్, దేవాలయం చైర్మన్ అమర్ సింగ్ తో ఎన్నో ఏండ్ల అనుబంధం ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం తో పాటు జంట నగరాలు , తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ శ్రీ దర్బార్ మైసమ్మ అమ్మవారిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు మెడికల్ క్యాంపును మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులతో, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఆశా వర్కర్లతో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో శ్రీ దర్బార్ మైసమ్మ దేవాలయం చైర్మన్ అమర్ సింగ్, దేవాదాయ శాఖ అధికారులు చంద్రకళ, సులోచన, రెవెన్యూ శాఖ అధికారులు వెంకటేశ్వర్లు, పోలీస్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు మంత్రి వెంట పాల్గొన్నారు.
