30.2 C
Hyderabad
September 11, 2026
ప్రత్యేకంహోమ్

#TeamIndia: అణు క్షిపణులు తీసుకెళ్లే జలాంతర్గామి సిద్ధం

#Aridaman

‘షిప్ సబ్‌మర్సిబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్’ (SSBN) ‘‘అరిదమన్’’ ను సిద్ధం చేసి భారత నౌకాదళం తన శక్తిని చాటింది. దేశీయంగా తయారు చేసిన మూడో అణు శక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి సబ్‌మరైన్ ఇది. నౌకాదళ పరిభాషలో ఇటువంటి సబ్‌మరైన్లను ‘షిప్ సబ్‌మర్సిబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్’ (SSBN)గా పిలుస్తారు. ఇప్పటికే INS Arihant (2016), INS Arighaat (2024) సేవల్లో ఉన్నాయి.

ఇవన్నీ ‘అరిహంత్ క్లాస్’కు చెందినవే. ఇప్పుడు అరిదమన్ కూడా అదే శ్రేణిలో చేరనుంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విశాఖపట్నంలో యుద్ధ నౌక ‘తారగిరి’ కమిషనింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే సమయంలో అరిదమన్ సబ్‌మరైన్‌ను కూడా సేవల్లోకి తీసుకురానున్నారు. అణు సబ్‌మరైన్లు గోప్యంగా పనిచేసే కారణంగా దీనికి పెద్దగా ప్రజా కార్యక్రమం ఉండదు.

అరిదమన్, అరిహంత్, అరిఘాట్ ఈ  మూడు అణు శక్తితో నడిచే సబ్‌మరైన్లు. ఇవి వారాల పాటు సముద్రం అడుగునే ఉండగల సామర్థ్యం కలిగి ఉంటాయి. భారత అణు సిద్ధాంతం ఏమిటంటే ‘ఫస్ట్ స్ట్రైక్’ను చేయదు. అయితే ప్రతీకార దాడి (retaliatory strike)లో సముద్రం అడుగున దాగి ఉన్న SSBNలు అత్యంత కీలకంగా పని చేస్తాయి.

ఈ సబ్‌మరైన్ 750 కి.మీ పరిధి గల K-15, అలాగే సుమారు 3,500 కి.మీ పరిధి గల K-4 బాలిస్టిక్ క్షిపణులను మోయగలదు. ఇవి అణు వార్‌హెడ్‌లను కూడా మోసే సామర్థ్యం కలిగి ఉంటాయి. అరిదమన్ ‘అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెసెల్’ (ATV) ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందించబడింది. ఇది భారతదేశ అణు త్రివిధ దాడి సామర్థ్యంలో (భూమి, గగనం, సముద్రం) కీలక భాగంగా నిలుస్తుంది.

ఇతర సబ్‌మరైన్లతో పోలిస్తే అరిడమన్ పొడవు ఎక్కువగా ఉండటంతో 4 స్థానంలో 8 లాంచ్ ట్యూబ్స్ ఉన్నాయి. దీంతో క్షిపణుల ప్రయోగ సామర్థ్యం రెట్టింపు అయింది. దీని హల్‌ను Larsen & Toubro తయారు చేయగా, విశాఖపట్నంలో నిర్మించారు. ఇందులో 83 మెగావాట్ల శక్తిగల స్వదేశీ ప్రెషరైజ్డ్ లైట్ వాటర్ రియాక్టర్‌ను Bhabha Atomic Research Centre అభివృద్ధి చేసింది.

మెరుగైన సోనార్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ టెక్నాలజీ, తక్కువ శబ్దంతో పనిచేసే హైడ్రోడైనమిక్ డిజైన్ కారణంగా శత్రువులకు కనిపించడం కష్టంగా ఉంటుంది. అణు శక్తితో నడిచే ఈ తరహా సబ్‌మరైన్లను నిర్మించే దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది.

అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా వంటి దేశాలతో పాటు భారత్ కూడా ఈ క్లబ్‌లో ఉంది. ఇక SSBNలతో పాటు అణు శక్తితో నడిచే అటాక్ సబ్‌మరైన్‌ను కూడా రష్యా నుంచి భారత్ తీసుకునే ప్రయత్నంలో ఉంది. అది 2027 నాటికి భారతదేశానికి చేరే అవకాశం ఉందని సమాచారం.

Related posts

నిర్మాతగా నా స్థాయిని పెంచే చిత్రం “మఫ్టీ పోలీస్”

Satyam News

బిహార్ లో ఎన్డీఏ సీట్ల పంపకం పూర్తి: రాజీపడ్డ నితీశ్

Satyam News

ప్రియురాలిని చంపి భారత్ పరారైన ప్రియుడు

Satyam News

పర్యావరణ పరిరక్షణకు అవగాహనే తొలి అడుగు

Satyam News

రహదారి భద్రత నియమాలు పాటించండి…!

Satyam News

హోర్మోజ్ లో బాంబులు ఎక్కడ పెట్టారో మరచిపోయిన ఇరాన్

Satyam News

Leave a Comment