మహిళలు అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే రాష్ట్రం, దేశంతో పాటు సమాజ ప్రగతిచక్రం మారుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
మంగళవారం విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్ భవనంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ, ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్ భాగస్వామ్యంతో జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్ షాప్లో కొండపల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదానికి అనుగుణంగా రాష్ట్రంలోని యువత, మహిళలు, డ్వాక్రా మహిళలు, నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యమన్నారు.
ఎంఎస్ఎంఈలతో దేశ జీడీపీలో 30 % ఆదాయంతో పాటు 50 %కు పైగా ఉద్యోగాల కల్పన జరుగుతోందన్నారు. నియోజకవర్గస్థాయిలో కూడా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నామని.. ఇప్పటికే 19 పార్కులు ప్రారంభించగా.. మరో 138 పార్కులు పురోగతిలో ఉన్నాయని.. వీటిద్వారా 2876 పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేసి రు. 8 వేల కోట్ల పెట్టుబడితో 1.03 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని కొండపల్లి పేర్కొన్నారు. ఇక కొత్త ఇండస్ట్రీల ఏర్పాటు కోసం సీఎంఈపీ పథకంలో రు. 300 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి చెప్పారు. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందజేస్తోందని.. వారు తీసుకునే డ్వాక్రా లోన్లపై ప్రతి యేడాది రు. 33, 500 వరకు ప్రాసెసింగ్ చార్జీలు ముఖ్యమంత్రి గారు రద్దు చేయించారని.. గ్రామీణ బ్యాంకుల వడ్డీని 13 % నుంచి 12 శాతంకు తగ్గించినట్టు తెలిపారు.
మరో అతిథి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఒక మహిళ ఒక పారిశ్రామిక వేత్త అన్న ముఖ్యమంత్రి నినాదాన్ని నిజం చేయాలంటే మహిళలు అందరూ సబ్సిడీల గురించి ఆలోచించకుండా… ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడిని సద్వినియోగించుకుని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదిగి.. మరి కొంతమందికి ఉపాధి కల్పించాలన్నారు. అప్పుడే దేశ రాష్ట్ర, దేశ జీడీపీ పెరుగడంతో పాటు ఆర్థికాభివృద్ధి జరుగుతుందన్నారు. యువకుడు అయిన మంత్రి కొండపల్లి ఎంఎస్ఎంఈల అభివృద్ది కోసం నిరంతరం కష్టపడుతున్నారంటూ ప్రశంసించారు.
ఈ వర్క్షాప్లో మెటా (Meta), అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్, వాల్మార్ట్ వృద్ధి, సీఐఐ-నీతి ఆయోగ్ (DX EDGE) వంటి అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ సంస్థలు మరియు వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లు డిజిటల్ రంగానికి మారడం, ఈ-కామర్స్ సేవలు పొందడం, ఎగుమతుల అవకాశాలు పెంచుకోవడం, బ్యాంకింగ్ రుణాలు మరియు జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ (ZED) సర్టిఫికేషన్ వంటి అంశాలపై హాజరైన వారికి అవగాహన కల్పించాయి. ఇక రాంప్ (RAMP) ప్రోగ్రామ్ కింద ఈ అవగాహన సదస్సులను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. విజయవాడ తర్వాత కృష్ణా, కాకినాడ, పల్నాడు మరియు గుంటూరు జిల్లాల్లో దశలవారీగా ఈ వర్క్షాప్లను ఏర్పాటు చేసి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారాన్ని అందించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఎంఈ సీఈఓ విశ్వమనోహరన్, ఎంఎస్ఎంఈ ఈడీ సుధాకర్ జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
