నేపాల్లో సంభవించిన భారీ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు చేపట్టిన సహాయక చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. మానస సరోవర్ యాత్ర వెళ్లిన ఏపీకి చెందిన పలువురు యాత్రీకులు నేపాల్ వరదల్లో చిక్కుకున్నారని అధికారులు సీఎంకు తెలిపారు.
వీరికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్టు ఇప్పటివరకు గుర్తించామని, వీరిలో 34 మంది సురక్షితంగా ఉన్నారని, మరో ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. రహదారి, విమాన మార్గాలు పునరుద్ధరించాల్సి ఉండటంతో ప్రస్తుతం కొందరు అక్కడే చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.
కర్నూలు-ఆదోని ప్రాంతానికి చెందిన నలుగురు టిబెట్లో సురక్షితంగా ఉన్నారని వారితో తాము మాట్లాడమని వివరించారు. అలాగే తిరుపతి ప్రాంతానికి చెందిన 28 మంది యాత్రికులు ఖాట్మండూలో సురక్షితంగా ఉన్నారని వారిని కూడా ఆర్టీజీఎస్ నుంచి సంప్రదించినట్టు అధికారులు చెప్పారు. ఇక చిత్తూరు, విజయవాడ, కాకినాడ, గుంటూరు వంటి ప్రాంతాలకు చెందిన ఏడుగురు గల్లంతు అయ్యారని తెలిపారు.
ఆచూకీ లభ్యం కాని ఏడుగురిలో ముగ్గురు ఈషా ఫౌండేషన్ తరపున మాసన సరోవర్ యాత్రకు వెళ్లి చిక్కుకున్నారని తెలిపారు. ప్రస్తుతం వారి ఫోన్లు అందుబాటులో లేవని అధికారులు సీఎంకు వివరించారు. బాధిత కుటుంబాలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నామని చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి నిరంతరం సమాచారాన్ని సేకరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వంతో పాటు… ఖాట్మంటూ, చైనాల్లోని ఎంబసీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.
నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరి క్షేమం కోసం అన్ని మార్గాల్లో సమన్వయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆచూకీ తెలియని వారి వివరాలను నిరంతరం ట్రాక్ చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో, భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలన్నారు.
రహదారి, విమాన మార్గాలు పునరుద్ధరణతో పాటు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షిత తరలింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కష్టాల్లో ఉన్న ఏపీ వాసులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడమే ప్రథమ ప్రాధాన్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ తాజా వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
