తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభావాన్ని పూర్తిగా కూల్చివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అణచివేయాలన్న కక్షతో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. అలాంటి రాజకీయాలకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
గ్రామగ్రామాన బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన దిమ్మెలు కూల్చినప్పుడే దివంగత ఎన్టీఆర్కు నిజమైన నివాళి అవుతుందని వ్యాఖ్యానించారు. ఖమ్మం పర్యటనలో చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావును ఘనంగా కీర్తించారు.
పేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. పేదల కడుపు నింపేందుకు రూ.2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.
పేదల సంక్షేమానికి అంకితమైన నాయకులుగా దివంగత ఎన్టీఆర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు చిరస్థాయిగా నిలిచిపోయారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ ప్రారంభించిన సంక్షేమ ఆలోచనలకు కొనసాగింపుగా ప్రస్తుత ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని చెప్పారు. అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందించడమే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అవుతుందని స్పష్టం చేశారు.
