తన తండ్రి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు స్థాపించిన సిరి మీడియాలో జరిగిన అవినీతి అక్రమాలపై ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరపాలని దాసరి నారాయణరావు కుమారుడు దాసరి తారక హరి హర ప్రభు కోరారు. ఈ మేరకు న్యూ డిల్లీలోని సీబీఐ డైరెక్టర్, ఈడి డైరెక్టర్ ప్రధాన కార్యాలయాల్లో, ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ఆయనతో బాటు న్యాయవాది కర్నాటి వెంకట రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటికే సిరి మీడియాలో జరిగిన అవినీతి అక్రమాలపై, అక్రమ లావాదేవీలపై హైదరాబాదులో ఈ నెల 8న తేదీన ఈడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అసలు కేసు పూర్వపరాలను ఒకసారి పరిశీలిస్తే తన తండ్రి స్వర్గీయ దాసరి నారాయణరావు మరణం తర్వాత సిరి మీడియాలో జరిగిన అవినీతి అక్రమాలపై అలాగే సిరి మీడియా తాలూకు ఆస్తులను తప్పుడు ధృవీకరణ పత్రాలతో కంపెనీ తీర్మానాలు చేసి వాటాదారుగా ఉన్న తనకే తెలియకుండా పక్కదారి పట్టించినట్లు ప్రభు చాలా కాలంగా చెబుతున్నారు.
తన తండ్రి మరణం తర్వాత సిరి మీడియాలో జరిగిన ఆర్థిక లావాదేవీలకు అవినీతి అక్రమాలకు తనకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొంటున్నారు. అసలు దోషులను బయటకు తీసుకురావాలని ఆయన కోరుతున్నారు.
