శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం శ్రీవేంకటేశ్వర స్వామివారికి ప్రభుత్వం తరఫున లాంఛనంగా పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
పుష్కలంగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని, దేశం అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందాలని శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సకల సంపదలతో వర్ధిల్లాలని శ్రీవారిని కోరుకున్నానని చెప్పారు.
శ్రీవేంకటేశ్వర స్వామిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు అపారమైన విశ్వాసం ఉందని చంద్రబాబు అన్నారు. దేశ, విదేశాల్లోని కోట్లాది మంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని కోరుకుంటారని తెలిపారు.
శ్రీవారి ఆలయాన్ని చక్కగా నిర్వహిస్తున్న పాలక మండలి, అధికారులు, సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. తిరుమలలో కొనసాగుతున్న క్రమశిక్షణతో కూడిన ఆలయ నిర్వహణ దేశంలోని ఇతర దేవాలయాలకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
తిరుమల వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చక్కటి దర్శన భాగ్యం కల్పించేందుకు పాలక మండలి, అధికారులు మరింత శ్రద్ధతో పనిచేయాలని చంద్రబాబు కోరారు. తిరుమలలోని ఆధ్యాత్మిక సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కాపాడుతూ వాటిని భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
