ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఎస్ఐఆర్ ప్రక్రియను సీఈవో సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, మృతులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను నిబంధనల మేరకు గుర్తించి తొలగించాలని సూచించారు.
బీఎల్ఓల వద్ద ఉన్న దరఖాస్తులు, ఓటర్ల జాబితాలను పరిశీలించిన సీఈఓ, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉంటే నిబంధనల ప్రకారం సరిచేయాలని సూచించారు. ఇంటింటి సర్వేలో ప్రతి కుటుంబంలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ధ్రువీకరించిన సమాచారం ఆధారంగానే మార్పులు, చేర్పులు, తొలగింపులు చేపట్టాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో డాక్యుమెంట్లను పరిశీలించి అవసరమైన వివరాలను సేకరిస్తున్నామని ఆయన తెలిపారు.
18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. బీఎల్ఓలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఈఓ సూచించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన ప్రతి వివరాన్ని సమగ్రంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితా అత్యంత కీలకమైనదని, ప్రతి దశలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటించాలని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఎస్ఐఆర్ ప్రక్రియను సీఈవోకి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితాలో నమోదు కాకుండా దూరమవ్వకుండా ప్రత్యేక దృష్టి సారించాలని, అనర్హుల పేర్లు కొనసాగకుండా నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాస్, ఆర్డీఓ దేవీదాస్, తహసిల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
