తన భర్త, బాలివుడ్ బాద్ షాగా వెలుగొందిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర మరణించిన తర్వాత తొలి సారిగా ఆయన భార్య హేమ మాలిని తన హృదయవేదనను సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు. సోమవారం 89 ఏళ్ల వయసులో ధర్మేంద్ర కన్నుమూసిన తరువాత హేమా మాలిని చేసిన ఇది తొలి స్పందన.
ఆయన తనకు భర్త మాత్రమే కాకుండా స్నేహితుడు, మార్గదర్శకుడు, తత్వవేత్త, కష్టకాలంలో ఆధారమైన వ్యక్తి.. అన్నీ అన్నీ అని ఆమె తన సోషల్ మీడియా పోస్టులో రాశారు. ఈ అపరిమితమైన లోటు జీవితాంతం ఎవరూ నింపలేనిదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తన వ్యక్తిగత నష్టాన్ని మాటల్లో చెప్పడం అసాధ్యమని, ఎన్నో దశాబ్దాల పాటు కలిసి గడిపిన అనుభవాలు, స్మృతులు ఇప్పుడు తనకు ఓదార్పు అని హేమా మాలిని తన ఎక్స్ ప్లాట్ఫారమ్లో పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆమె ఇద్దరూ కలిసి గడిపిన పాత ఫోటోలు కూడా పంచుకున్నారు.
ధర్మేంద్ర తన ఇద్దరు కూతుళ్లు ఈషా, ఆహనాపై అపారమైన ప్రేమ చూపించే ఆదర్శ తండ్రి అని గుర్తుచేసుకున్నారు. ధర్మేంద్ర తన కుటుంబ సభ్యులందరితో స్నేహపూర్వకంగా, ప్రేమగా మెలిగేవారని ఆమె పేర్కొన్నారు. ఆయనతో నటించిన “షోలే”, “సీతా ఔర్ గీతా”, “ప్రతిగ్యా” వంటి హిట్ చిత్రాలను స్మరించుకున్న హేమా మాలిని, ఆయన వినయం, అసమాన ప్రజాదరణ, నటన ప్రతిభ ఆయనను భారత సినీ చరిత్రలో అమరుడిగా నిలబెట్టాయని అన్నారు.
ఎంతటి ఖ్యాతి సంపాదించినప్పటికీ అహంకారం లేకుండా, అందరితో అనుబంధంగా ఉండే అరుదైన వ్యక్తిత్వం ఆయనదేనని ఆమె పేర్కొన్నారు. డిసెంబర్ 8న 90 ఏళ్ల వయసులో ప్రవేశించాల్సిన ధర్మేంద్ర కొంతకాలం అనారోగ్యంతో బాధపడ్డారు. ముంబై విలే పార్లెలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
మరణ వార్తను కుటుంబసభ్యులు ఆఖరి వరకు గోప్యంగా ఉంచారు. నవంబర్ 11న కొన్ని మీడియా సంస్థలు ధర్మేంద్ర మరణించినట్లు తప్పుడు వార్తలు ప్రసారం చేయడంతో హేమా మాలిని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆరోగ్యంగా కోలుకుంటున్న వ్యక్తి గురించి బాధ్యత లేని విధంగా అబద్ధ వార్తలు ప్రసారం చేయడం అమానుషమని ఆమె అప్పట్లో ఎక్స్లో ఆగ్రహించారు.
ఒకరోజు తర్వాత ఆయనను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చినప్పటికీ, చివరకు జూహూ నివాసంలోనే ఆయన పరమపదించారు. ధర్మేంద్రను స్మరించుకుంటూ, ఆయన అంతిమ సంస్మరణ కార్యక్రమం గురువారం ముంబైలోని బాంద్రా టైజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్లో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరగనుంది. హిందీ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
