మరో ఆన్ లైన్ గేమింగ్ వెబ్ సైట్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం WinZO Games Pvt. Ltd. డైరెక్టర్లు సౌమ్యా సింగ్ రాథోర్, పవన్ నందలను అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద సాగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ చర్య తీసుకున్నారు. ఈ నిందితులను కోర్టులో కస్టడీ కోసం ఇద్దరినీ హాజరుపరచనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
ఇటీవల సంస్థ కార్యాలయాలపై నిర్వహించిన సోదాల అనంతరం ఈ అరెస్టులు జరిగాయి. ఈడీ నవంబర్ 24న విడుదల చేసిన ప్రకటనలో, ప్రభుత్వము రియల్ మనీ గేమింగ్ (RMG)ను ఆగస్టు 22, 2025 నుంచి నిషేధించినప్పటికీ, WinZO సంస్థ గేమర్లకు తిరిగి చెల్లించాల్సిన రూ.43 కోట్లు తమ వద్దే నిల్వ ఉంచిందని ఆరోపించింది.
భారతదేశం నుంచే బ్రెజిల్, అమెరికా, జర్మనీ వంటి దేశాల్లో కూడా రియల్ మనీ గేమ్స్ నిర్వహించిందని, అదే ప్లాట్ఫారమ్ ద్వారా కార్యకలాపాలు కొనసాగించిందని ఈడీ పేర్కొంది. అదేవిధంగా సంస్థ కస్టమర్లను మభ్యపరిచే విధంగా, అసలు మనుషులతో కాకుండా ఆల్గోరిథమ్లతో ఆడేలా చేసి, ఆ విషయాన్ని వినియోగదారులకు తెలియజేయకుండా ‘అనైతిక పద్ధతులకు’ పాల్పడిందని కూడా ఆరోపించింది.
వాలెట్లలో ఉన్న డబ్బులను వినియోగదారులు ఉపసంహరించుకునే అవకాశాన్ని సంస్థ కావాలనే అడ్డుకుందని, నిజమైన కస్టమర్లు పెట్టిన బెట్టింగ్ మొత్తాలను కోల్పోయేలా చేసి అక్రమ లాభాలు ఆర్జించిందని ఈడీ వెల్లడించింది. సోదాల్లో భాగంగా WinZO Gamesకు చెందిన బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ల రూపంలో ఉన్న మొత్తం రూ.505 కోట్ల ఆస్తులను కూడా ఈడీ స్తంభింపజేసింది.
అంతేకాక, గేమర్ల నిధులను నిలుపుదల చేయడం, నిషేధం అనంతరం కూడా RMGలను పరోక్షంగా కొనసాగించడం వంటి అంశాలపై సంస్థపై విచారణ వేగవంతమైంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు డైరెక్టర్ల అరెస్టులు జరగగా, ఈడీ వారిని మరింత విచారణ కోసం కోర్టు కస్టడీ కోరనుంది.
